న్యూఢిల్లీ : క్రికెట్ అభిమానులకు ఇది చేదు వార్తే. రెండు దశాబ్దాలకుపైగా క్రికెట్ ప్రేమికులను అలరించాడు సచిన్ టెండుల్కర్. మరోసారి భారత క్రికెట్ దేవుడి ఆటను చూడొచ్చని సంబరపడ్డ క్రికెట్ అభిమానుల ఆశ నిరాశగా మిగలనున్నది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 సీజన్-2కు సచిన్ దూరం కానున్నాడు. టోర్నీ తొలి సీజన్లో ఇండియా లెజెండ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించగా.. చాంపియన్గా నిలిచింది. తొలి సీజన్లో ఆడిన ఆటగాళ్లకు టోర్నీకి సంబంధించి పూర్తి ఫీజులు చెల్లించలేదు. ఈ క్రమంలో బకాయిలు ఉన్న మొత్తం ఆటగాళ్లు ఫిర్యాదు చేయగా.. మ్యాచ్ ఫీజులు అందని వారి జాబితాలో సచిన్ పేరు సైతం ఉన్నది.
రోడ్ సేఫ్టీ సిరిస్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. ఆటగాళ్లుకు బకాయిలు చెల్లించలేదని మొదట బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ దేశ ఆటగాళ్లు ఖలీద్ మహమూద్, ఖలీద్ మషూద్, మెహ్రాబ్ హుస్సేన్, రజిన్ సలేహ్, హన్నన్ సర్కార్, నఫీన్ ఇక్బాల్కు బకాయిలు రావాల్సి ఉంది. తొలి సీజన్లో టోర్నీకి బ్రాంచ్ అంబాసిడర్గా సచిన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. అలాగే భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కమిషనర్గా ఉన్నారు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరిస్ సెకండ్ సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈల)లో మార్చి 1 నుంచి 19 వరకు జరుగనున్నది. అయితే, టెండూల్కర్ టోర్నీకి దూరం కానున్నాడు. బకాయిలు చెల్లించని కారణంగా సచిన్ సైతం టోర్నీలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. 2020 సీజన్లో తొలిసారిగా టోర్నమెంట్ నిర్వహించిన సమయంలో ఒప్పందం తర్వాత ఆటగాళ్లందరికీ పదిశాతం మొత్తాన్ని చెల్లించారు. ఆ తర్వాత 25 ఫిబ్రవరి 2021 నాటికి 40శాతం, 31 మార్చి వరకు 50శాతం చెల్లించాల్సి ఉండగా.. ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో సచిన్తో పాటు ఆటగాళ్లు ఈ సీజన్కు దూరమవుతున్నట్లు తెలుస్తున్నది. టెండుల్కర్తో పాటు యువరాజ్ సింగ్, ఎస్ బద్రీనాథ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ సైతం ఇండియా లెజెండ్స్ తరఫున టోర్నీలో పాల్గొన్నారు.