కొండాపూర్ : సాఫ్ట్వేర్ ఉద్యోగం.. మంచి జీతం.. సహోద్యోగిని ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించి తిరుపతి వెంకన్న సాక్షిగా పరిణయమాడాడు. చివరకు విధి ఆడిన నాటకంలో పెండ్లయిన మూడురోజులకే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన చెన్నైలో జరిగింది. నవవరుడు శేరిలింగంపల్లి వాసి. పోలీసుల వివరాల ప్రకారం..శేరిలింగంపల్లి నేతాజీనగర్లోని నివాసముంటున్న మురళీకృష్ణ, అన్నపూర్ణ దంపతులకు శ్రీనివాసులు (36), నవీన్ కుమారులు. శ్రీనివాసులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, చిన్న కొడుకు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కంపెనీలో సహోద్యోగి అయిన చెన్నైకు చెందిన కనిమొళితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కుటుంబసభ్యులను ఒప్పించి ఈనెల 21న ఆదివారం తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఆనందంగా బుధవారం చెన్నైలోని అత్తగారింటికి శ్రీనివాసులు, కనిమొళి దంపతులు కారులో బయల్దేరారు. కృష్ణగిరి ప్రభుత్వ దవాఖాన వద్ద వేగంగా వెళ్తున్న వీరి కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. కనిమొళి, అదే కారులో ఉన్న ఆమె చెల్లెలికి తీవ్రగాయాలయ్యాయి. కనిమొళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.