మహదేవపూర్, జూలై 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత నది, తెలంగాణలోని గోదావరి నదుల ప్రవాహం గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
రెండు నదుల ద్వారా సోమవారం బరాజ్ ఇన్లో 8,400 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, మంగళవారం బరాజ్ ఇన్ ఫ్లో 10,600 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో బరాజ్ లోని మొత్తం ఎనిమిది బ్లాక్ లలో ఉన్న 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ లో ప్రస్తుత వరద ప్రవాహం సముద్ర మట్టానికి 89.40 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా బరాజ్ కు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
మేడిగడ్డ బరాజ్లో క్రమం క్రమంగా వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పరివాహక గ్రామాలైన అంబటిపల్లి, పెద్దంపేట, లెంకలగడ్డ తో పలు గ్రామాల ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. మెడిగడ్డ బరాజ్ లో గేట్లు అన్ని ఎత్తివేయడం జరిగిందని, గోదావరి లో జాలర్లు చేపలు పట్టేవారు, ఇతరులు ఎవరు నది వద్దకు వెళ్లకూడని, వరద ముంపు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.