గద్వాల, మే 12 : కాంగ్రెస్ పాలనలో ధాన్యం అమ్ముకునే రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా ధాన్యం అమ్ముకోవడంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రైతులకు మద్దతు ధర దేవుడెరుగు కాని ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాలకు వస్తే ధాన్యం తూకం వేయడానికి 20రోజులు, దానిని తరలించడానికి మరో వారంరోజులు పడుతుండడంతో వారి ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. దీంతో ప్రభుత్వం రైతులకు ఇచ్చే మద్దతు ధర ఖర్చులకే సరిపోయే పరిస్థితి నెలకొన్నది. ధర తక్కువైనా బయట దళారులకు అమ్ముకోవడానికి రైతులు ఇష్టపడుతున్నారు.
దళారులైతే వారే కల్లాల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసుకొని వెళ్లిపోతుండడంతో రైతులకు ట్రాన్స్పోర్టు ఖర్చులు మిగిలిపోవడంతోపాటు హమాలీ తదితర ఖర్చులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు తమ ధాన్యం అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు అవస్థలు పడుతున్న వారి గోస ఎవరికి పట్టం లేదు. ధాన్యం కొనుగోళ్లలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. గద్వాల వ్యవసాయ మార్కెట్లో ఇటు మక్కలు, అటు వరి ధాన్యంతో మార్కెట్ పరిసరాలు నిండిపోయాయి. వాటిని కొనుగోలు చేస్తే తప్పా ఇతర రైతులు ధాన్యం తీసుకరావడానికి అవకాశం లేదు. కొనుగోలు చేసి మక్కలు తరలించడంలో జాప్యంతోపాటు అవసరమైన గోదాంలు లేకపోవడంతో మార్క్ఫెడ్ అధికారులు గద్వాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న షెడ్లలో కొనుగోలు చేసిన మక్కలు నిల్వ చేయడంతో ఇతర రైతులు ధాన్యం తెచ్చుకొని అమ్ముకునే పరిస్థితి కనిపించడం లేదు. దీనిని సాకుగా చూపి కొనుగోలు కేంద్రం ఎత్తేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మక్క సాగు..
జిల్లాలో ఈ యాసంగిలో రైతులు 86,122 ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. ఎకరాకు 2క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసి సరాసరి 21,53,071 క్వింటాళ్ల మక్కలు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో మొత్తం ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఇప్పటి వరకు 48,468 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశారు. నత్తనడకన కొనుగోళ్లు జరుగుతుండడం, అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు చేసిన మక్కలు గోదాంలకు తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో మార్కెట్ నిండ మక్కల సంచులు, లాట్లతో నిండిపోయింది.
వరి సాగు విషయానికి వస్తే..
జిల్లాలో ఈ యాసంగిలో రైతులు 74,162 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యం నిర్ణయించారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లాలో 76కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2502మంది రైతుల నుంచి 18,306 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారుల ఇచ్చిన వివరాల ప్రకారం తెలుస్తోంది. కొన్నది గోరంత కొనాల్సింది కొండంత ఉంది. వరి ధాన్యం పండించిన రైతులు తమ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు, గోదాంలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.