హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ): వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తకువగా ఉండే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన రైతునేస్తం కార్యక్రమంలో మాట్లాడుతూ… జూన్, జూలై నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రత్యామ్నాయ పంటల సాగుపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకొని ముందుకు సాగాలని రైతులకు సూచించారు.
అధిక నీటి అవసరం ఉన్న వరి సాగును తగ్గించి, లాభసాటి పంట అయిన ఆయిల్పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, అవసరమైన నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. రిటైల్ దుకాణాల్లో 22.67 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.56 లక్షల బస్తాలు, మార్ఫెడ్ వద్ద 59.56 లక్షల బస్తాలు, గోడౌన్లలో 3.56 లక్షల బస్తాలు కలిపి మొత్తం 90.22 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4.06 లక్షల మంది రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకొన్నారని తెలిపారు. మొత్తంగా రైతులు 13.22 లక్షల యూరియా బస్తాలను బుక్ చేసుకోగా, వాటిలో 11.18 లక్షల బస్తాలను ఇప్పటికే కొనుగోలు చేశారని చెప్పారు. రైతుల సూచనలకు అనుగుణంగా ఫర్టిలైజర్ యాప్లో నిరంతరం మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. స్మార్ట్ఫోన్ లేని రైతుల కోసం టోల్-ఫ్రీ నంబర్ ద్వారా యూరియా బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.