న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, కస్టమ్స్ సుంకాల్లో సవరణలు చేయాలని, సరసమైన వడ్డీరేట్లకే రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని దేశీయ ఎగుమతిదారులు డిమాండ్ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను మోదీ సర్కారు ముందస్తు బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన వర్చువల్ మీటింగ్లో ఎగుమతిదారులు తమకు దన్నుగా నిలవాలంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఒకింత ఆందోళనను వ్యక్తం చేశారు. దేశీయ ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాల కల్పనకు రాబోయే బడ్జెట్లో ప్రాధాన్యతనివ్వాలని కోరారు.
రూపాయి దెబ్బ
డాలర్తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువ దేశీయ ఎగుమతుల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తున్నదని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) తెలిపింది. కాబట్టి ప్రభుత్వం నుంచి తగినంత మద్దతు అవసరమని ఆర్థిక మంత్రికి వివరించింది. ఈ క్రమంలోనే ప్రోత్సాహకాలు అటు ఎగుమతుల వృద్ధికి, ఇటు అదనపు ఉద్యోగాల సృష్టికి అనువుగా ఉండాలని సూచించింది. కాగా, విదేశీ మార్కెటింగ్ కోసం ఎగుమతిదారులు చేసే ఖర్చుపై 200 శాతం పన్ను కోతకు వీలు కల్పించాలన్నది. అలాగే ప్రైవేట్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించి ఓ గ్లోబల్ ఇండియన్ షిప్పింగ్ లైన్ను ఏర్పాటు చేయాలన్నది. ఇక ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో టీసీఎస్ నుంచి మినహాయింపునివ్వాలని కూడా ఎఫ్ఐఈవో విజ్ఞప్తి చేసింది.
కంటితుడుపు చర్యలు వద్దు
గ్లోబల్ మార్కెట్లో గూడ్స్కు డిమాండ్ క్షీణిస్తున్నదని ఈ సందర్భంగా ఎగుమతిదారులు తెలిపారు. ఈ క్రమంలోనే మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) పథకం కింద కల్పించిన రూ.200 కోట్ల మద్దతును కంటితుడుపు చర్యగా ఎఫ్ఐఈవో అభివర్ణించింది. దేశీయ ఎగుమతులు 460-470 బిలియన్ డాలర్లకు చేరాలంటే ఈ తరహా చిన్నపాటి సాయం ఎంతమాత్రం పనికిరాదని వ్యాఖ్యానించింది. గత ఏడాది దేశ ఎగుమతుల్లో కనీసం 0.5 శాతానికి సమానమైన కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయాలని సూచించింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఎగుమతుల వృద్ధికి ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలని కోరింది. ఈ ఏప్రిల్-అక్టోబర్లో దేశ ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 33.12 శాతం ఎగిసి 436.81 బిలియన్ డాలర్లను తాకాయి. దీంతో వాణిజ్య లోటు 173.46 బిలియన్ డాలర్లుగా ఉన్నది. నిరుడు ఇది 94.16 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం. భారత్ నుంచి ఆయా దేశాలకు ప్రధానంగా రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, ఔషధ, సముద్ర ఉత్పత్తులు, తోలు ఎగుమతి అవుతున్నాయి. అక్టోబర్లో ఇవన్నీ గతంతో చూస్తే పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
‘ప్రస్తుతం దేశంలో ఉద్యోగాల సృష్టి, ఉపాధి కల్పనలే అతిపెద్ద సవాల్గా కనిపిస్తున్నాయి. దీన్ని అధిగమించాలంటే ఎగుమతి ఆధారిత సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనివ్వాలి. అప్పుడే ఎగుమతుల రంగంలో కొత్త కొలువులకు అవకాశం ఉంటుంది’
-భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య