ఎనిమిదేండ్ల కిందటి మాట.. తెలంగాణ అంటే.. హైదరాబాదే. మరో తొమ్మిది జిల్లాలు ఉన్న సంగతి ప్రపంచానికి తెలియనే తెలియదు. పెట్టుబడులంటే హైదరాబాద్లోనే.. మరో జిల్లా ఉనికే లేదు. ఇప్పుడు.. తెలంగాణ అంటే.. ప్రతి పది పదిహేను కిలోమీటర్లకు ఒక గ్రోత్ ఇంజిన్. 15 కిలోమీటర్లకు ఓ మండల కేంద్రం.. 30 కిలోమీటర్లకు రెవెన్యూ డివిజన్.. వంద కిలోమీటర్లను మించని జిల్లా కేంద్రాలు.. అందుబాటులో అన్ని పాలనావ్యవస్థలు.. అద్భుతమైన ఇన్ఫ్రా.. రోడ్ కనెక్టివిటీ, 24 గంటల విద్యుత్తు.. పరిశుభ్రమైన నీరు.. మార్కెటింగ్ సదుపాయం.. మానవ వనరుల లభ్యత.. ఇంకేం కావాలి పెట్టుబడులు రావడానికి.. ఇంకేం కావాలి.. భూముల ధరలకు రెక్కలు రావడానికి.. అభివృద్ధి హైదరాబాద్ దాటి ఆదిలాబాద్ దాకా పరుగులు పెడుతున్నది.
భూముల ధరలను ఆకాశం ఆకర్షిస్తున్నది. ఒకనాటి నెర్రెలువారిన భూమి ఇవాళ పచ్చని మాగాణమై బంగారంగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2700 కోట్లు ఉంటే.. ఒక్క ఏడాదిలో పదివేల కోట్లకు పైగా విలువైన భూ లావాదేవీలు జరగటం ఇందుకు తార్కాణం.
ఒకప్పుడు తీవ్ర కరువు మండలమైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం తలరాత.. భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో ఒక్కసారిగా మారిపోయింది. ఎకరానికి రూ.30 లక్షలు ఇస్తామన్నా అమ్మేవాళ్లు అక్కడ ఎవరూ లేరు! ఒక సాగునీటి ప్రాజెక్టు సాధించిన ఫలితమిది!
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో 2012లో ఎకరం రూ.2.5 లక్షల చొప్పున విక్రయిస్తే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత కామారెడ్డి జిల్లాగా అవతరించడం, బాన్సువాడ మున్సిపాలిటీ కావడంతో ఎకరాకు కోటిన్నర ఇస్తామన్నా అమ్మే పరిస్థితి కనిపించడం లేదు! కేసీఆర్ చేపట్టిన పాలనా సంస్కరణ సాధించిన విజయమిది!
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ‘సెలాంపు’ అనే ప్రాంతం పొలాలు, మధ్యలో పది, ఇరవై ఇండ్లు తప్ప పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు అక్కడికి సమీపంలో జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటయ్యాయి. రైల్వేస్టేషన్ సిద్ధమవుతున్నది. ఏడేండ్ల క్రితం లక్ష, రెండు లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.కోట్లలో పలుకుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో అభివృద్ధి పనులు అందిస్తున్న లక్ష్మీకటాక్షమిది!
ఇప్పుడు తెలంగాణలో ఎకరం ఉన్న రైతు లక్షాధికారి! ఐదెకరాలపైన ఉంటే కోటీశ్వరుడే! సబ్బండ వర్ణాల ఆదాయం పెరిగింది.. వ్యవసాయం పండగైంది.. కొద్దోగొప్పో మిగులు తేలుతున్నది! అది కొత్త ఆస్తుల విక్రయానికి మార్గం సుగమం చేస్తున్నది.. ఫలితంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం.. క్రమేణా పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నది!
(కాసాని మహేందర్ రెడ్డి ) : భూమి లేదా ఇల్లు కొనుగోలు.. ‘అక్కడ ధర పెరుగుతుందా?’ అనే ప్రశ్నతోనే మొదలవుతుంది. సమీపంలో రోడ్డో, బడో, గుడో, కంపెనీయో, ప్రభుత్వ ఆఫీసో, ప్రైవేట్ సంస్థో, టూరిస్ట్ ప్రాంతమో ఉన్నాయా? అని చూస్తారు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. గతంలో ఇలాంటి పెట్టుబడి ఆకర్షక ప్రాంతాలు నగరాలు, పట్టణాలకే పరిమితం. ఇవాళ తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, పాలనా సంస్కరణలతో ప్రతి ఊరూ పెట్టుబడి ఆకర్షక ప్రాంతంగా మారింది.
ఇవాళ ఏ ఊరు నుంచి లెక్కేసుకున్నా సగటున ప్రతి 15 కిలోమీటర్లకు ఒక మండల కేంద్రం.. 30 కిలోమీటర్లకు ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రం కనిపిస్తాయి. జిల్లా కేంద్రాల సగటు దూరం 50 కి.మీ.కే పరిమితమైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్య రెట్టింపైంది. జిల్లా లేదా మండల కేంద్రం, మున్సిపాలిటీ అంటే పాలనా కేంద్రం మాత్రమే కాదు.. అదో పెద్ద వ్యాపార కేంద్రం. అనేక ప్రభుత్వ ఆఫీస్లు ఏర్పాటవుతాయి. కంపెనీలు వచ్చి, ఉపాధి పెరుగుతుంది. పెద్ద పెద్ద భవనాలతో నగర వాతావరణం ఏర్పడుతుంది. ప్రజల వలస మొదలవుతుంది. దీంతో కొత్త ఇండ్లు, స్కూళ్లు, దవాఖానలు.. ఇలా ఎన్నో వసతులు సమకూరుతాయి. ఒకనాడు 10 ప్రాంతాలకే పరిమితమైన ఈ వాతావరణం.. నేడు 33 ప్రాంతాలకు విస్తరించింది.
మండల కేంద్రాల్లోనూ వికేంద్రీకరణ ఫలాలు కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు.. తెలంగాణలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలకు సైతం ఐటీ విస్తరించడంతో రియల్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్లు వెలుస్తున్నాయి. రియల్ రంగం నాలుగు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 1) సుస్థిరమైన ప్రభుత్వం. 2) సంస్కరణలు. 3) ప్రజల జీవన ప్రమాణాలు. 4) శాంతి భద్రతలు.
సుస్థిర ప్రభుత్వం
స్థిరమైన ప్రభుత్వముంటేనే నిర్ణయాలు సజావుగా, సకాలంలో తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలు కొన్నేండ్లపాటు మారవనే భరోసా ఉంటుంది. రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతున్నది. అన్నీ ప్రజానుకూల నిర్ణయాలే కావడం ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో సానుకూల దృక్ఫథాన్ని కలిగించింది. భవిష్యత్తును ఊహించి తెచ్చిన.. తీసుకొస్తున్న పాలసీల ఫలితాలు మరో దశాబ్దం దాక వస్తూనే ఉంటాయనేది నిపుణుల మాట. దీంతో రియల్ఎస్టేట్కు కొత్త ఉత్సాహం వచ్చింది.
సంస్కరణల పథం
రాష్ట్ర అభివృద్ధి రథాన్ని ముందుకు తీసుకెళ్లేవి సంస్కరణలు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అనూహ్య సంస్కరణలు ప్రవేశపెడుతున్నది. ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. టీఎస్ ఐపాస్ ద్వారా సుమారు 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చారు. ఇందులో సుమారు 9 వేల పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించాయి. దాదాపు 13 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడంతోపాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. 2014లో కేవలం రూ.57 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే, ఏడేండ్ల తర్వాత ఇప్పుడు అది రూ.1.45,626 కోట్లకు పెరిగింది.
ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షల నుంచి 6.28 లక్షలకు చేరింది. అమెజాన్, యాపిల్, మైక్రోసాప్ట్, గూగుల్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు విస్తరించాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. 50 కంటే ఎక్కువ టాప్ మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో కార్యాలయాలు ప్రారంభించాయి. అందుకే రియల్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. భూమి విలువ ఊహించనంత పెరుగుతున్నది.
మారిన జీవన విధానం
ప్రజల్లో కొనుగోలు శక్తి ఉన్నప్పుడే భూముల క్రయవిక్రయాలు సాగుతాయి. 2014లో రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ప్రభుత్వ చర్యలతో 2020-21 నాటికి 2.37 లక్షలకు పెరిగింది. దీంతో ప్రజలు తమ సంపాదనను భూమిపై పెట్టుబడిగా పెట్టడం మొదలైంది.
శాంతి భద్రతలు
శాంతి భద్రతల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 27వేల మంది నూతన సిబ్బందిని నియమించారు. మహిళాభద్రత కోసం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్స్ ఏర్పాటుచేశారు. దేశంలోనే తొలిసారి ప్రత్యేకంగా ఉమెన్సేఫ్టీ వింగ్ను ఏర్పాటుచేశారు. మరోవైపు హైదరాబాద్తోపాటు, రాష్ట్రంలో ఎక్కడా ఉగ్రవాద ఛాయలు కనిపించడం లేదు. ఇవన్నీ రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నాయి.
మున్సిపాలిటీతో దశ తిరిగింది
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన ముగ్గురు సోదరులు 2012లో తమకున్న ఐదెకరాల భూమిని ఎకరాకు రూ.2.5 లక్షల చొప్పున విక్రయించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కామారెడ్డి జిల్లాగా అవతరించడం, బాన్సువాడ మున్సిపాలిటీ కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. బోర్లం గ్రామంలోని అదే భూమిని ఇప్పుడు ఎకరాకు రూ.కోటిన్నరకు అడిగినా అమ్మేందుకు యజమాని నిరాకరిస్తున్నాడు. అంటే.. దాదాపు విలువ 70 రెట్లు పెరిగింది. ఇదొక్కటే కాదు.. బాన్సువాడ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల తలరాత మొత్తం మారిపోయింది. రోడ్డుకు ఉన్న భూములకు రూ. 2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన పాలనా సంస్కరణల ఫలితానికి ఇది నిదర్శనం.
జిల్లా కేంద్రంతో లక్ష్మీ కటాక్షం
జిల్లా కేంద్రాలు గ్రామాలకు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకొచ్చాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ‘సెలాంపు’ అనే ప్రాంతం ఒకప్పుడు దుద్దెడ గ్రామానికి అనుబంధం. పొలాలు, మధ్యలో పది, ఇరవై ఇండ్లు తప్ప పెద్దగా అభివృద్ధి చెందలేదు. కొండ ప్రాంతం కావడంతో వందల అడుగులు బోర్లు వేసినా పడని పరిస్థితి. అటు సిద్దిపేటకు, ఇటు దుద్దెడకు మధ్యలో దూరంగా ఉండటంతో ఒకప్పుడు భూములు కొన్న నాథుడే లేడు. ఇప్పుడు సెలాంపు ప్రాంతంలో ఓవైపు సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటయ్యాయి. మరోవైపు రైల్వేస్టేషన్ పనులు తుది దశకు చేరాయి. ఏడేండ్ల కిందట ఎకరం రూ.లక్ష, రెండు లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.కోట్లలో పలుకుతున్నాయి. కలెక్టరేట్కు కిలోమీటర్ దూరంలో ఉన్న వెంచర్లలో కూడా చదరపు గజం రూ.12-15వేల మధ్య పలుకుతున్నది. రోడ్డు పక్కన రూ.30-40 వేలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా.. అమ్మేవారే లేరు.
‘రిజిస్ట్రేషన్’ రాబడి నాలుగింతలు
రాష్ట్రంలో భూముల ధరలు పెరుగటమే కాదు.. క్రయవిక్రయాలు సైతం విపరీతంగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ పెట్టుబడికి భూమినే గమ్యస్థానంగా ఎంచుకొంటున్నారు. పెరిగిన ఆదాయాన్ని భూముల కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. దీంతో లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా 2014-15తో పోల్చితే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం ఐదారు రెట్లు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,700 కోట్లు ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తున్నది. అంటే.. అప్పట్లో ఏడాది ఆదాయం ఇప్పుడు మూడు నెలల్లోనే వచ్చేస్తున్నదన్నమాట. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో సుమారు 8 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయితే.. ఆ తర్వాతి ఏడాది నుంచే స్పష్టమైన మార్పు కనిపించింది. ఏకంగా 2 లక్షల డాక్యుమెంట్లు అదనంగా రిజిస్టర్ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే ధరణి, స్టాంపులు రిజిస్ట్రేషన్లు కలిపి ఏకంగా సుమారు 12 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి
ఇండ్లకూ మస్తు డిమాండ్
గతంలో ఇల్లు కొనడమంటే అందరూ హైదరాబాద్వైపే చూసేవారు. ఊరు విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చి స్థిరపడటాన్ని స్టేటస్ సింబల్గా భావించేవారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పట్టణాలు హైదరాబాద్ తర్వాతి స్థానంలో ఉండేవి. ఇండ్ల క్రయవిక్రయాలు సైతం అక్కడే ఎక్కువ జరిగేవి. ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ సైతం మూడునాలుగు పట్టణాలకే పరిమితమయ్యేది. తెలంగాణ ప్రభుత్వం చర్యల ఫలితంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో సైతం ఇండ్లకు డిమాండ్ పెరిగింది.
ఇప్పటికే కట్టిన ఇండ్ల ధరలు రెండుమూడు రెట్లు పెరుగగా, కొత్త ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతున్నది. ఇతర రాష్ర్టాల నుంచి లక్షల మంది కూలీలు వచ్చి నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతుండటమే ఇందుకు నిదర్శనం. చిన్న పట్టణాల్లో సైతం అపార్ట్మెంట్ సంస్కృతి విస్తరించింది. ఐదారేండ్ల కిందటితో పోల్చితే అధిక శాతం గ్రామాల్లో కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. పట్టణాలు, వాటికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో అయితే ఏకంగా కొత్త వెంచర్లు, నెలల రోజుల్లోనే కాలనీలు పుట్టుకొస్తున్నాయి. ఏడేండ్ల కిందటితో పోల్చితే అన్ని పట్టణాలకు కొన్ని కిలోమీటర్ల మేర విస్తీర్ణం పెరిగింది. ఒకప్పుడు హైదరాబాద్కు ఔటర్ రింగ్రోడ్ హద్దుగా ఉండేది. ఔటర్కు లోపల రెండుమూడు కిలోమీటర్ల వరకే నగరం పరిమితమైంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు దాటి పదుల కిలోమీటర్ల దూరం విస్తరించింది.
ఎత్తిపోతలతో తలరాత మారింది
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం ఒకప్పుడు తీవ్రమైన కరువు ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా తర్వాత అత్యల్ప వర్షపాతం ఇక్కడే నమోదయ్యేది. వందల అడుగులు బోర్లు వేసినా నీళ్లు పడుతాయన్న గ్యారంటీ లేదు. దీంతో ఎక్కడ చూసినా బీడువారిన పొలాలే కనిపించేవి. పొలం అమ్ముకొందామన్నా రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు మించి పలుకని దుస్థితి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ మండలం తలరాత మారిపోయింది. 2016లో భక్త రామదాసు ఎత్తిపోతల పథకంతో జలసిరులు పారాయి. ప్రాజెక్టు సుమారు 90వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. దీంతో బీడువారిన పొలాలకు కొత్త జవసత్వాలు రాగా.. కోనసీమను తలపించేలా పచ్చదనం పరుచుకొన్నది. అద్భుతంగా పంటలు పండుతున్నాయి. దీంతో భూములు బంగారం అయ్యాయి. ఇప్పుడు ఎకరానికి రూ.30 లక్షలు ఇస్తామన్నా అమ్మేవాళ్లు కరువయ్యారు. ఒక సాగునీటి ప్రాజెక్టు ఫలితంగా ఆరేండ్లలోనే భూముల ధరలు పది రెట్లు పెరిగాయి.
రెండేండ్లలోనే 10 రెట్లు పెరిగింది
నేను 2020 ప్రారంభంలో ఏడు లక్షలకు ఎకరం చొప్పున భూమి కొన్నా. సంవత్సరం తర్వాత దానిని ఐదారు రెట్లు లాభానికి వేరే వ్యక్తికి అమ్మేశాను. ఇప్పుడు ఆ భూమిని రూ.70 లక్షలకు ఎకరం చొప్పున అడుగుతున్నాను. అయినా ఆ వ్యక్తి అమ్మడానికి ఇష్టపడటం లేదు. రెండేండ్లలోనే భూమి విలువ 10 రెట్లు పెరిగింది.
– శ్రీశైలం, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా
మారుమూల ప్రాంతాల్లోనూ కొంటున్నారు
15 ఏండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా. ఒకప్పుడు అన్ని గ్రామాల వారు వచ్చి సిద్దిపేటలో స్థిరపడాలని కోరుకొనేవారు. ఇక్కడే పెట్టుబడి పెట్టేవారు. ఊళ్లో ఉన్న జాగలు అమ్ముకొని వచ్చేవారు. కానీ.. ఎనిమిదేండ్లలోనే సీన్ రివర్స్ అయ్యింది. సిద్దిపేట పట్టణం విస్తీర్ణం సుమారు ఐదారు కిలోమీటర్లు పెరిగింది. భూముల ధరలు పదుల రెట్లు పెరిగాయి. గ్రామాల్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా కనీసం రూ.20 లక్షలు పలుకుతున్నది.
– సురేందర్రెడ్డి, సిద్దిపేట