భూపాలపల్లి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి (MLA Gandra Venkata Ramanareddy) ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి రైతులు నిరసనలు తెలిపినా బుద్ధి రావడం లేదు విమర్శించారు.
2004 నుంచి 2009 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 గంటల కరెంటు ఇస్తానని వాగ్దానం చేసిందన్నారు. ఇదే విషయం నాడు అసెంబ్లీలో ప్రశ్నించడానికి తాను సిద్ధపడగా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం విద్యుత్ రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తుందని వెల్లడించారు.
సభ్యతా, సంస్కారం లేకుండా మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి రిమోట్ కంట్రోల్ అని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు (Raitu Bandu ) ,రైతు బీమా ,24 గంటలు ఉచిత కరెంటు ఇలా అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయడంతో రైతుల వద్దకు ఏం ముఖం పెట్టుకొని పోవాలో అర్థం కాక రేవంత్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
గత ఎన్నికల సమయంలో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్దని , అద్యక్షుడిగా ఒక టికెట్ అయినా ప్రకటించగలవా ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజధాని లేని ఏపీని ముందుకు పట్టించుకోవాలని, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.