పైచిత్రంలో కనిపిస్తున్నది నిజామాబాద్ జిల్లా రెంజల్ ఎంపీపీ లోలపు రజిని. ఆమె బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధి. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలని మండల ప్రజాపరిషత్తులో ఆదివారం తీర్మానం ప్రతిపాదించారు. బీజేపీకి చెందిన బోర్గాం ఎంపీటీసీ రుక్మిణి, ఇతర సభ్యులు మద్దతు తెలిపారు. తీర్మానం కాపీని ఎంపీడీవో గోపాలకృష్ణకు అందజేశారు. బీజేపీకే చెందిన డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఇంతకుముందు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు కంటె సత్యనారాయణ కూడా గ్రామ పంచాయతీ చేసిన తీర్మానానికి మద్దతు తెలపడం విశేషం. తమ పార్టీకే చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రదర్శిస్తున్న ఈ తరహా చొరవను రాష్ట్ర బీజేపీ నేతలు ఆదర్శంగా తీసుకొంటే రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇది చూసైనా రాష్ట్ర బీజేపీ నేతలు రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ముందుకు వస్తారా?
న్యూస్నెట్వర్క్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తీర్మానాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వరుసగా రెండో రోజు కూడా విశేషంగా స్పందించారు. ఆదివారం పలు గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు తీర్మానాలు చేశాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ నల్లగొండ, హనుమకొండ జిల్లా పరిషత్తులు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కరీంనగర్ జిల్లా కరీంనగర్, శంకరపట్నం, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, ముత్తారం, కోరుట్ల, ఖమ్మం జిల్లా పెనుబల్లి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల ప్రజా పరిషత్తులతో పాటు పలు గ్రామ పంచాయతీలు, వ్యవసాయ సహకార సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశానికి విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి హాజరయ్యారు.
హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ మారపల్లి సుదీర్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ చైర్మన్ శ్రీరాములు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్ హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ సింధూరాకుమారి, డోర్నకల్ మున్సిపల్ వాంకుడోత్ వీరన్న తీర్మానాలు ప్రవేశపెట్టారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ప్రజా పరిషత్తు ఆమోదించిన తీర్మానం కాపీలను ప్రధాని మోదీకి పోస్టు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీర్మానాల పరంపర రెండో రోజు కూడా కొనసాగింది. కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, శంకరపట్నం ఎంపీపీ సరోజన ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆయా మండల పరిషత్తులు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి అధ్యక్షతన తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి, కొత్తపేట గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేశారు.
కథలాపూర్ మండలం సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు చేశారు. కోరుట్లలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన తీర్మానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, గంభీరావుపేట మండల కేంద్రాల్లో రైతు బంధు సమితి సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరులో పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సమక్షంలో నిర్వహించిన గ్రామ సభలో సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి తీర్మానాలు ప్రవేశపెట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకులమైలారం సర్పంచ్ గొరిగే కళమ్మ రాజు, మీర్ఖాన్పేట సర్పంచ్ జ్యోతి శేఖర్, కందుకూరు సర్పంచ్ శమంతకమణి, లేమూరు సర్పంచ్ పరంజ్యోతి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు ఆమోదించారు.
మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు థామస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో తీర్మానం కాపీలను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి పీయూష్గోయల్కు పోస్టు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీఎంఎస్, డీసీసీబీల పరిధిలో తీర్మానాలు ప్రారంభమయ్యాయి. పాల్వంచలో నిర్వహించిన డీసీఎంఎస్ పాలకవర్గ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ శేషగిరిరావు, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెనుబల్లిలో జరిగిన సమావేశానికి హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానపత్రంపై సంతకం చేశారు
వడ్లను కేంద్రమే కొనాలి : శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ రూరల్, మార్చి 27 : రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సర్పంచ్ శ్రీకాంత్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కేంద్రమే కోనుగోలు చేసి ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.