వాషింగ్టన్, నవంబర్ 16: హెచ్ఐవీ సోకిన వ్యక్తి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఔషధాలను క్రమం తప్పకుండా వాడాలి. లేకపోతే వైరస్ క్రమంగా తన సంఖ్యను పెంచుకుంటూ మరణాన్ని కలుగజేస్తుంది. అయితే, ఎలాంటి ఔషధాలను వాడకుండానే హెచ్ఐవీ వైరస్ పెరుగుదలను నియంత్రించుకోగలుగుతున్న రోగిని తాజాగా గుర్తించినట్టు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అమెరికాకు చెందిన ఈ మహిళా రోగిలోని 150 కోట్ల రక్త కణాలను పరిశోధించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. హెచ్ఐవీ వృద్ధిని స్వతహాగా అడ్డుకొనే సామర్థ్యం ఉన్న వారిలో ఈ రోగి రెండో వ్యక్తి (మొదటి రోగి శాన్ఫ్రాన్సిస్కో వ్యక్తి) అని వెల్లడించారు. హెచ్ఐవీ వృద్ధిని అడ్డుకున్నప్పటికీ, ఆ వైరస్ ఉనికిని సమూలంగా తరిమేసే శక్తి ఇంకా ఈ రోగుల్లో లేదని తెలిపారు.