ఖైరతాబాద్, ఫిబ్రవరి 28 : రాష్ట్ర బడ్జెట్లో బీసీల అభ్యున్నతి కోసం జరిపే కేటాయింపులను రూ.10వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్కు ఒక వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కు సబ్సిడీ రుణాల కోసం రూ.3వేల కోట్లు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్కు రూ.2 వేల కోట్లు, 12 బీసీ కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్ప త్తి ప్రకారం రూ.2వేలు కోట్లు ఇవ్వాలని అన్నారు.
ఐఐ టీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు కూడా పూర్తి ఫీజులు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు మంజూ రు చేయాలని కోరారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న విద్యా సంస్థలు, హాస్టళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లతో సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. ఈ దఫా బీసీల బడ్జెట్ పెంచుతామని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అద్యక్షులు సీ రాజేందర్, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జీ అనంతయ్య తదితరులు ఉన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి గంగుల సమీక్ష
మార్చి 7న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఖైరతాబాద్లోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాలు, సంక్షేమహాస్టళ్లు, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు, కల్యాణలక్ష్మి, ఆత్మగౌరవ భవనాలు తదితర కార్యక్రమాలకు సంబంధించి ఆర్థికశాఖకు అందజేయాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ, మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, బీసీ స్టడీసరిల్ ఎండీ అలోక్కుమార్, వడ్డెర ఫెడరేషన్ ఎండీ బాలాచారి, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఎండీ విమలాదేవి పాల్గొన్నారు.