హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ): ఆరుకోట్ల గ్రామీణ జనాభాకు డిజిటల్ సాక్షరత కల్పించేందుకు గాను చేపట్టిన పీఎం గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎంజీడీఐఎస్హెచ్ఏ)కు చేయూతనందించేందుకుగాను ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనో ఇండియా భాగస్వామిగా చేరింది. ఇందుకోసం సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్తో జట్టుకట్టింది. ఈ మేరకు ఐదు రెనో కార్లను సంస్థ విరాళంగా అందజేసింది. హైదరాబాద్ శివారులోని కడ్తాల్ గ్రామంలో ఈ కార్లని అందజేసింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న సాధారణ ప్రజలకు నైపుణ్యాభివృద్ధితో పాటు, వృత్తిపరమైన నైపుణ్యాలు అందించేందుకు రెనో సంస్థ ఈ కార్లను అందజేసింది. రెనో ఇండియా నేషనల్ ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె, సీఎస్సీఎస్పీవీ ఎండీ దినేష్ త్యాగి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.