రంగారెడ్డి, మే 18, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రైతన్నల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన మాట మేరకు రుణాలను మాఫీ చేయడంతోపాటు ఇన్ఫుట్ సబ్సిడీ, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులతోపాటు ఉచిత విద్యుత్తును అందిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ఏ రైతైనా మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తున్నది.
నాలుగేండ్లలో రూ.166 కోట్ల బీమా సాయం
రైతు కుటుంబంలో పెద్ద దిక్కు మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. ఆ కుటుంబాన్ని అప్పుల బారి నుంచి కాపాడడమే కాకుండా సంబంధిత కుటుంబం నిలదొక్కుకునేలా ఆదుకుంటున్నారు. రైతు బీమా పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు నాలుగేండ్లలో 3329 మంది రైతులు మరణించగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.166 కోట్లను మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు పరిహారాన్ని అందజేశారు. మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు తొలుత రూ.5 లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం.. తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది.
ప్రభుత్వమే చెల్లిస్తున్న ప్రీమియం డబ్బు
2018-19 ఆర్థిక సంవత్సరంలో 835 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.41.75 కోట్లు, 2019-20లో 825 మంది అర్హులుగా గుర్తించి రూ.41.25 కోట్ల సొమ్మును సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 2020-21లో 1189 మంది రైతులు మృతిచెందగా రూ.59.45 కోట్లు, 2021-22లో 480 మంది రైతులు మృతిచెందగా సంబంధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.24 కోట్ల బీమా సాయాన్ని నేరుగా సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రైతు బీమా పథకంలో భాగంగా బీమా సంస్థలకు ఒక్కో రైతుకు రూ.3486 ప్రీమియం డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తున్నది. జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది రైతులుండగా సుమారు 1.50 లక్షల మంది రైతులు రైతు బీమాకు అర్హులుగా జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం గుర్తించింది. 2019-20లో ఒక్కో రైతుకు రూ.3013 చొప్పున రూ.45.19కోట్ల ప్రీమియం డబ్బును రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించగా, గతేడాది ప్రీమియం డబ్బు పెరిగిన దృష్ట్యా.. ఒక్కో రైతుకు రూ.3486 చొప్పున రూ.52.29కోట్ల ప్రీమియంను సర్కార్ వెచ్చించింది.
సర్కార్కు రుణపడి ఉంటాం సోలీపేట రైతు పహిల్వాన్ కుటుంబం
షాబాద్ : రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం చిన్నసోలీపేట్ గ్రామానికి చెందిన ఎండీ పహిల్వాన్ ఈ ఏడాది మార్చి 30న అకస్మాత్తుగా మృతిచెందాడు. ఆయన పేరుపై గ్రామంలో రెండు ఎకరాల భూమి ఉంది. రైతు బీమా పథకం ద్వారా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏప్రిల్ 22న రూ.5లక్షల ప్రమాదబీమా డబ్బులు మృతుడి భార్య జహేదాబేగం బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తమకు కొండంత ధైర్యాన్ని కల్పించిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పహిల్వాన్కు భార్య జహేదాబేగం, ఒక కుమారుడు హైమద్, ఇద్దరు కూతుర్లు సానాబేగం, హస్మాబేగం ఉన్నారు. కుమారుడు మొయినాబాద్ మండలంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు పదో తరగతి వరకు చదివింది. చిన్న కూతురు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నది. ప్రభుత్వం అందించిన డబ్బు మా కుటుంబానికి ఆసరాగా నిలిచిందని చెబుతున్నారు. సర్కార్కు రుణపడి ఉంటామని తెలిపారు.
మనోధైర్యాన్నిచ్చిన రైతు బీమా జక్కుల వీరమణి, తులేకలాన్
ఇబ్రహీంపట్నం : తులేకలాన్ గ్రామంలో 1.20 ఎకరాల పొలం నా భర్త జక్కుల అంజయ్య పేరున ఉంది. నా భర్త ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో మా కుటుంబానికి సర్కారు నుంచి రైతు బీమా కింద రూ.5లక్షలు అందింది. ఈ డబ్బు తో ఉన్న అప్పులు అన్ని కట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాం. పిల్లలను పోషించుకుంటూ ఉన్నాను. నా భర్త చనిపోవడం బాధగా ఉన్నప్పటికీ.. ఆయన లేని లోటూ తీరుస్తూ ప్రభుత్వం రూ.5లక్షలు అందించడంతో మనోధైర్యంతో ఉన్నాను.