హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కిడ్నీలో రెండు, మూడు రాళ్లు ఉంటేనే ఆ నొప్పిని తట్టుకోవడం కష్టం. పరిమాణం పెద్దగా ఉంటే సర్జరీ తప్పనిసరి. నొప్పితోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలూ ఎదురవుతాయి. ఖరీదైన చికిత్స అవసరం. అలాంటిది ఓ వ్యక్తి కిడ్నీల్లో ఏకంగా 156 రాళ్లు బయటపడ్డాయి. సర్జరీ చేయకుండా వాటిని తొలగించడం అసాధ్యమైనా.. నగరంలోని ప్రీతి యూరాలజీ దవాఖాన వైద్యులు కీ హోల్ విధానం ద్వారా తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఉపాధ్యాయుడు బసవరాజ్ మడివలార్(50)కు ఇటీవల కడుపునొప్పి రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.
మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ అందుకు భిన్నంగా కడుపు దగ్గరగా ఉన్నట్టు గుర్తించారు. దీన్ని వైద్యపరిభాషలో ఎక్టోపిక్ కిడ్నీ అంటారు. బసవరాజ్ చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రీతి యూరాలజీ, కిడ్నీ దవాఖానను ఆశ్రయించాడు. వైద్యులు ఆపరేషన్ లేకుండా కీహోల్ సర్జరీ విధానంలో లాప్రోస్కోపి, ఎండోస్కోపి పద్ధతుల ద్వారా శరీరంపై చిన్న రంధ్రం చేసి మూడు గంటలు శ్రమించి 156 రాళ్లను విజయవంతంగా తొలగించారు. ఈ విధానంలో ఇంత పెద్దమొత్తంలో రాళ్లను తొలగించడం దేశంలో ఇదే మొదటిసారని దవాఖాన ఎండీ డాక్టర్ చంద్రమోహన్ వెల్లడించారు. రోగికి రెండేళ్లకు ముందు నుంచే రాళ్లు ఏర్పడటం మొదలై ఉంటుందని వివరించారు. ప్రస్తుతం బసవరాజ్ పూర్తిగా కోలుకుంటున్నాడని తెలిపారు.