న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఫ్యూచర్ రిటైల్ టేకోవర్ లావాదేవీకి రిలయన్స్ రిటైల్ స్వస్తిచెప్పింది. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు రూ.24,713 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసిన 21 నెలల తర్వాత, ఈ డీల్ సాధ్యంకాదని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సెక్యూర్డ్ రుణదాతలు ఓటు చేసిన నేపథ్యంలో ఇక లావాదేవీని పూర్తిచేయడం సాధ్యంకాదని రిలయన్స్..స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ ఒప్పందానికి అనుమతి కోరుతూ ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు వాటి షేర్హోల్డర్లు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణదాతల సమావేశాల్ని ఈ వారంలో నిర్వహించాయి.