న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రెండు మెగా పబ్లిక్ ఇష్యూలకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ యోచిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్), రిలయన్స్ జియో ప్లాట్ఫాం (ఆర్జేపీఎల్) ఐపీవోలను రూ.50,000-75,000 కోట్ల శ్రేణిలో భారీగా తీసుకురావాలని చూస్తున్నారు.
ఇరు సంస్థల్లో కనీసం 10 శాతం మేర వాటాలను అమ్మకానికి పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది జరగబోయే సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో ఈ బాహుబలి ఐపీవోల గురించి అంబానీలు ప్రకటన చేసే వీలుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. రిలయన్స్ రిటైల్ విలువను దాదాపు రూ.8 లక్షల కోట్లుగా, జియోను సుమారు రూ.7.5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
రిలయన్స్ రిటైల్, జియో షేర్లను భారతీయ స్టాక్ మార్కెట్లతోపాటు విదేశీ స్టాక్ మార్కెట్లలోనూ నమోదు చేసే ఆలోచనలో ముకేశ్ అంబానీ ఉన్నారు. ముఖ్యంగా రిలయన్స్ జియో షేర్లను అమెరికాలోని నాస్డాక్లో లిస్టింగ్ చేసే వీలున్నది. టెక్నాలజీ సంస్థలకు నాస్డాక్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పడితే మార్కెట్ రెగ్యులేటర్లకు ప్రాస్పెక్టస్ను సమర్పించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్కల్లా ఐపీవోలను పట్టాలెక్కించవచ్చని చెప్తున్నారు. రిలయన్స్ రిటైల్కు దేశవ్యాప్తంగా దాదాపు 14,500 స్టోర్లున్నాయి. అలాగే జియోకు 420 మిలియన్ల కస్టమర్లున్నారు.