తిరుమల : ఏడుకొండలస్వామి వెంకన్న కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో అక్టోబర్ నెలకు ( October Month ) సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను టీటీడీ విడుదల అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని వివరించారు.21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు.
23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు , 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తామన్నారు.
ఈనెల 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.