IVG | హైదరాబాద్, డిసెంబర్ 18 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ‘జంబలకిడి పంబ’ సినిమా గుర్తుందా? పురుషులు మహిళలుగా, మహిళలు పురుషులుగా మారి నవ్విస్తారు. శాస్త్రవేత్తలు తాజాగా తీసుకురాబోతున్న అత్యాధునిక ఐవీజీ (ఇన్-వెట్రో డిరైవ్డ్ హ్యూమన్ గేమేట్స్) సాంకేతికతతో దాదాపుగా అవే పరిస్థితులు రాబోతున్నాయి. అయితే, ఈ విధానంలో మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా మారనప్పటికీ.. పురుషుల ద్వారానే ఇప్పటివరకూ సాధ్యమవుతున్న శుక్రకణాలను మహిళల సాయంతో, స్త్రీల నుంచి సేకరిస్తున్న అండాలను పురుషుల సాయంతో సృష్టించవచ్చు.
ఎలా సేకరిస్తారు?
పురుషుడి చర్మంలోని మూల కణాలతో అండాన్ని, స్త్రీ చర్మంలోని మూల కణాలతో శుక్రకణాలను ఐవీజీ టెక్నిక్ సాయంతో పరిశోధకులు తయారు చేయాలనుకొంటున్నారు. 2012లో మగ, ఆడ ఎలుక తోక చర్మం నుంచి సేకరించిన మూల కణాలతో పరిశోధకులు వరుసగా అండం, శుక్రకణాలను సృష్టించడమే కాకుండా ప్రయోగశాలలో కృత్రిమగర్భధార పద్ధతిలో టెస్ట్ ట్యూబ్ ఎలుకకు జీవంపోశారు. ఇప్పుడు అదే విధానంలో మనుషుల్లోనూ ప్రయోగాలు చేయాలనుకొంటున్నారు.
లాభమేంటి?
క్యాన్సర్బారిన పడిన మహిళల్లో అండాల విడుదల సక్రమంగా ఉండదు. వయసురీత్యా గర్భధారణ జరిగే అవకాశమూ మరికొందరికి దూరమవ్వచ్చు. మారిన జీవనశైలి కారణాలతో పురుషుల్లోనూ సంతాన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి దంపతులకు తమ జీవ కణాల ద్వారానే సృష్టించే సంతానాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పద్ధతిని తీసుకొస్తున్నట్టు పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే, ఈ విధానం భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులకు కారణం కావొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.