గద్వాల, డిసెంబర్ 16 : జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ రైతులకు ఈ ఏడాది క్రాఫ్ హాలిడే తప్పేటట్టు లేదు. ఈ వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి సామార్థ్యం తగ్గుముఖం పట్టడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతుండగా, అధికారులు మాత్రం రైతులు సాగు చేస్తున్న పంటలకు నీళ్లిస్తామని స్పష్టమైనా హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఈ యాసంగిపై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తున్నది. ప్రస్తుతం జూరాలలో 3.920టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఈ నీటిని ప్రజలకు తాగునీరు అందించడంలో భాగంగా మిషన్భగీరథ ఇతర అవసరాలకు వినియోస్తున్న క్రమంలో యాసంగిలో పంటలకు నీరు అందించడం కష్టంగా మారింది. గతంలో నారాయణపూర్ నుంచి రీజనరేటర్ వాటర్ వస్తుండడంతో జూరాల కింద యాసంగి పంటలకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే ఈ ఏడాది యాసంగిలో నారాయణపూర్ డ్యాం కింద క్రాఫ్ హాలిడే ప్రకటించడంతో నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో యాసంగి పంటలసాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది యాసంగిలో జూరాల కింద 14,534 ఎకరాలు, నెట్టెంపాడ్ కింద 40,044, ఆర్డీఎస్ కింద 33,683 ఎకరాలకు సాగునీరిచ్చారు. ప్రస్తుతం మూడు ప్రాజెక్టుల కింద నీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్డీఎస్కు సంబంధించి తుంగభద్ర డ్యాంలో ఉన్న నీటిని నిల్వను బట్టి ఈ వానాకాలం పంటలకు 3టీఎంసీల ఇండెంట్ను ప్రస్తుతం మనం వాడుకున్నాం. ఇక డ్యాంలో నీరు అనుకున్న స్థాయిలో నిల్వ లేకపోవడంతో ఆర్డీఎస్ కింద యాసంగి పంటలకు నీరు వదలడం లేదు. దీంతో జిల్లాలో ఆర్డీఎస్, జూరాల, నెట్టెంపాడ్ ప్రాజెక్టుల కింద అధికారులు క్రాఫ్ హాలిడే ప్రకటించే అవకాశమున్నది. ఈ రెండు రోజుల్లో అధికారులు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తున్నది. కేవలం బోరుబావుల కింద మాత్రమే రైతులు ఈ యాసంగిలో పంటలు సాగు చేసుకునే అవకాశముంది