వంటనూనె తయారీ సంస్థల్ని కోరిన ఎస్ఈఏ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: వంటనూనెల కనీస చిల్లర ధర (ఎమ్మార్పీ)ను తగ్గించాలని తయారీ సంస్థలను ఆ పరిశ్రమ సంఘం సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం కోరింది. వినియోగదారులకు ఊరట కల్పించేలా వెంటనే కిలోకు రూ.3-5 మేర తగ్గించాలని ఓ ప్రకటనలో తమ సభ్యులకు విజ్ఞప్తి చేసింది. కాగా, పండుగ సీజన్ దృష్ట్యా గతేడాది నవంబర్లోనూ ఇలాగే ఎమ్మార్పీని తగ్గించాలంటూ వంటనూనెల తయారీ కంపెనీలను ఎస్ఈఏ కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశీయ అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా దేశీయ మార్కెట్లో ధరలు తగ్గాల్సిన అవసరం ఉన్నదని ఎస్ఈఏ చెప్తున్నది. ఇందులోభాగంగానే ఉత్పత్తిదారులకు పైవిధంగా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఆయా రకాలనుబట్టి కిలో వంటనూనె సగటు ధరలు రూ.130.53 నుంచి రూ.187.03గా ఉన్నాయి. నిరుడు ఇదే సమయంలో రూ.164.55గా ఉన్న కిలో పల్లినూనె ఇప్పుడు రూ.177.75 పలుకుతున్నది. ఆవాల నూనె సైతం రూ.145.02 నుంచి రూ.187.03కు ఎగబాకింది. అలాగే సోయా నూనె ధర రూ.126.03 నుంచి రూ.147.36కు, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.144.22 నుంచి రూ.161.75కు, పామాయిల్ రూ.113.89 నుంచి రూ.130.53కు ఎగిశాయి.