హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఏడేండ్ల కాలంలో తెలంగాణ తనను తాను పునరావిష్కరణ చేసుకొన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్రంలో మిగతా పార్టీలకు రాజకీయాలు గేమ్ అయితే టీఆర్ఎస్కు టాస్క్ అని, పవిత్ర కర్తవ్యమని తెలిపారు. తమ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించినా.. వ్యక్తిగతంగా నిందించినా వదిలిపెట్టామని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో దాదాపు 91 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి చరిత్రాత్మక ప్రకటన చేశారు. ఉదయం పది గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే ముందుగా సీఎం మాట్లా డారు. తెలంగాణ ఉద్యమ మూల అంశాలైన నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకొన్నామని వెల్లడించారు. ఉద్యోగ నియామకాల ప్రకటన క్రమంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. తెలంగాణ గతంలో హైదరాబాద్ స్టేట్ రూపంలో కొంతకాలం ఒకదేశంగా.. ఆ తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత ఒక రాష్ట్రంగా.. ఆ తదనంతరం ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నది. ఈ క్రమంలో నడిచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అందరికీ తెలిసిందే. 1969 ఉద్యమం సమయంలో నేను టెన్త్ క్లాస్లో ఉన్నా. సిద్దిపేట పట్టణంలో పోలీసు వాళ్లు కొట్టిన దెబ్బలు పడ్డా. మీరు (స్పీకర్) కూడా మాసబ్ట్యాంకులో లాఠీ దెబ్బలు తిన్నరు. ఉద్యమాల పరంపర దశాబ్దాల తరబడి కొనసాగింది. తెలంగాణ సమాజం అంతులేని వివక్ష, అన్యాయంతో నలిగిపోయింది. 2014లో తెలంగాణ ఏర్పడేవరకు మనందరం ఆ క్షోభ, ఆ బాధ అనుభవించినవాళ్లమే. ఆకలిచావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు. రావాల్సిన ఉద్యోగాలు రావటంలేదనే నిర్లిప్తతలో యువత తుపాకులు పట్టుకొని తీవ్రవాదులైన సందర్భాలు చూశాం. తెలంగాణ రైతులను పాతాళంలోకి తొక్కేసిన భయంకరమైన ప్రపంచబ్యాంకు ఆంక్షలు, విద్యుత్తు సంస్కరణల పేరిట అంతులేకుండా విద్యుత్తు చార్జీలు పెరగటం లాంటివి ఎన్నో. తెలంగాణ ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరుగదని తేలిన ఆ సందర్భంలో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న నేను ఏదైతే అదయిందని పిడికెడు మందితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన. ప్రజల దీవెన, భగవంతుని దయ, పోరాటంలో ఉన్న న్యాయం, ప్రజల్లో ఆర్తి, తెలంగాణ సమాజం తెలివిని చూపి ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు పోరాడింది. 14-15 సంవత్సరాల సుదీర్ఘ ఘర్షణ తర్వాత రాష్ట్రం సాకారమైంది.
రాష్ట్రం సాకారమైన తర్వాత స్పీకర్ స్థానంలో మధుసూదనాచారి ఉన్నప్పుడు.. ‘తెలంగాణ తనను తాను పునర్దర్శించుకోవాలె.. తనను తాను పునర్నిర్వచించుకోవాలె.. చుట్టూ అలుముకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలె’ అని చెప్పినం. ఎవరేమన్నా పట్టించుకోలేదు. కొంతమంది బాధ్యతగా ఉన్నవాళ్లు.. కొందరు రాజకీయాల కోసమే అరాకిరి చేసేవాళ్లు ఉన్నరు. ఈ మధ్య రాజకీయాల్లో చాలా పెడ ధోరణులు చూస్తున్నం. కొంతమంది పనికిమాలిన వాళ్లు స్పీకర్ మీద కామెంట్ చేసినరు. ఈ సభ ద్వారా సభ్యులకు, ప్రజలకు మళ్లీ మనవి చేస్తున్నం.. వేరే పార్టీలకు, వేరే వ్యక్తులకు రాజకీయాలంటే గేమ్. కానీ టీఆర్ఎస్కు రాజకీయాలంటే టాస్క్. పవిత్రమైన కర్తవ్యం. ఏది తీసుకున్నా అంత సీరియస్గా తీసుకుంటం. ఎందుకంటే మేము ఈ రాష్ర్టాన్ని తెచ్చిన వాళ్లం. ఇవ్వాళ చాలా చాలా మాట్లాడేవాళ్లు, ఎత్తూ పొడుగూ ఉన్నవాళ్లు ఆ రోజు ఎక్కడున్నరో ప్రజలకు తెలుసు. మేం ఏం చేసినమో కూడా తెలుసు. టీఆర్ఎస్ కార్యకర్తలు పేగులు తెగేదాకా ఇదే అసెంబ్లీలో ఎట్లా కొట్లాడిన్రో, బయట ఎట్లా కొట్లాడిన్రో, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నరో, ఎన్ని జైళ్లకు పోయిన్రో అందరికీ తెలుసు. మంత్రులు నిన్నమొన్నటిదాకా రైల్వే కేసులు ఎదుర్కొన్నరు. అట్లా పోరాటంచేసి తెలంగాణ తెచ్చినం.
నీళ్లల్లో వాటా తెచ్చుకొన్నం.. ఇంకా తెచ్చుకొనేది ఉన్నది. కొట్లాడుతున్నం. పోరాటం కంటిన్యూ అయితది. సమైక్య రాష్ట్ర సీఎంలతో నేనే వాదించిన.. గోదావరిల నీళ్లు వేస్టుగా పోతున్నవి.. అవి ఇస్తే ఏంపోయింది? అని అడిగినం. వాళ్లు ఇయ్యలే. ఇయ్యాల తెచ్చి చూపిచ్చినం. తమరి (స్పీకర్) చేత్తోనే.. గతేడాది ఏప్రిల్ 24, 25న హరీశ్రావు, మిగతావాళ్లు ఉన్నరు. మెదక్లో నిజాంసాగర్ నింపినం. హల్దీ వాగులోకి నీళ్లను పంపి అట్నుంచి మంజీరకు పంపినం. ఇప్పుడు తెలంగాణలో కొత్త డిమాండ్ వచ్చింది. వాగులు నింపాలని అడుగుతున్నరు. కాల్వలకు నీళ్లియ్యాలె. హల్దీ వాగుల మంజీరల నీళ్లు విడిచిపెట్టాలె. గోదావరి నుంచి ఇంత కష్టపడి ఎందుకు తెచ్చిండ్రు.. విచ్చలవిడిగా నీళ్లు ఇవ్వండి. బ్రహ్మాండంగా ఇవ్వండి. అది వాళ్ల హక్కు అని ఇస్తున్నం.
ఎండిపోకుంట పంటలు బ్రహ్మాండంగా పండుతున్నవి. ఆకాశం భూమంత ఉండే కేంద్ర ప్రభుత్వం వాటిని కొనకుండా ఎల్లెల్కల పడ్డది. తెలంగాణలో ఎంత పంట పండిస్తున్నమంటే మోసేటోడు.. కోసేటోడు.. గుంజెటోడు సరిపోతలేడు.. మూడు నెలలపాటు ధాన్యం సేకరణ.. ఎన్ని డీసీఎంలు.. ఎన్ని లారీలు.. 7 వేల కొనుగోలు కేంద్రాలు పెట్టినా సరిపోవడం లేదు. ఫంక్షన్ హాళ్లు, జూనియర్ కాలేజీలు, హైస్కూల్ అన్నింటా ధాన్యమే. రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యమే. ఇక నిధులకు సంబంధించి మన పైసా మనకే ఖర్చవుతున్నది. అది ఎంతైనా కానీ.. కలిగినంతలో, ఉన్నంతలో ఖర్చు పెట్టుకొంటున్నం. దేశంలోనే బెస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రంగా ఉన్నాం. ఒక్క రూపాయి వేస్ట్ పోకుండా తెలంగాణ పైసలు తెలంగాణకే ఖర్చవుతున్నాయి.
మేము చేసే పనిలో మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు. చిల్లరగాళ్లు అని వదిలి పెట్టినం. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు. ప్రజలు ఫెయిల్ కావొద్దు అని మేం పోతూనే ఉన్నం. అందులో మేం సఫలీకృతులమయ్యాం ఉద్యమ సందర్భంలో నీళ్లు, నిధులు, నియమాకాలు ప్రధాన నినాదంగా ఉన్నది. తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు రావాలి. తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాలి. తెలంగాణ నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి. గతంలో మొత్తం తరలించుకుపోయిన్రు. హుడా భూముల ఆదాయాన్ని వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టిన్రు. ఆ రోజు ఉన్న ఘనత వహించిన మన నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొన్నరు. అందువల్ల వాళ్లు ఇష్టం వచ్చినట్టు చేసిన్రు. ఇవేకాదు. అస్తిత్వం, భాషాసంస్కృతి పరిరక్షణ.. చాలా ఉన్నయి. ఇప్పుడు భాష పరిరక్షణ జరిగింది. ఇవ్వాళ తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అయితున్నడు. ఒకప్పుడు జోకర్లకు మన భాష పెట్టేది. తెలంగాణ సంస్కృతి, బోనాలు, బతుకమ్మ ఎంత వైభవంగా జరుగుతున్నయో అందరికీ అనుభవంలో ఉన్నది. సంతోషంతో సంబురాలు చేసుకొంటున్నరు. ధూపదీప నైవేద్యం ప్రతి గుడికీ ఇవ్వాలని అర్చకులు అడుగుతున్నరు. సేవాలాల్ మహరాజ్ జయంతి, సమ్మక్క సారక్క పండుగను అధికారికంగా జరుపుకొంటున్నం.