Hyderabad | న్యూఢిల్లీ, అక్టోబర్ 8: రాష్ట్ర రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనంలోకి జారుకున్నది. హైదరాబాద్లో వరుసగా పడిపోతున్న ఇండ్ల అమ్మకాలు దీన్నే సూచిస్తున్నాయి మరి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ గృహ విక్రయాలు నీరసంగానే సాగాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ వేదిక ప్రాప్టైగర్.కామ్ మంగళవారం దేశీయ రెసిడెన్షియల్ మార్కెట్పై ‘రియల్ ఇన్సైట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత నెల సెప్టెంబర్తో ముగిసిన 3 నెలల్లో హౌజింగ్ సేల్స్ ఏకంగా 19 శాతం దిగజారాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. నిరుడు జూలై-సెప్టెంబర్లో 14,191 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇదే సమయంలో 11,564 యూనిట్లకే పరిమితమయ్యాయి.
బయ్యర్లలో తగ్గిన ఆసక్తి
గత ఏడాదిదాకా హైదరాబాద్లో పరుగులు పెట్టిన స్థిరాస్తి మార్కెట్.. ఇప్పుడు పడకేసింది. ప్రస్తుతం కొనుగోలుదారుల్లో ఇండ్లను కొనాలన్న ఆసక్తే కనిపించట్లేదని వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్లో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు ఒక కారణమైతే.. రుణ లభ్యత కఠినం కావడం మరో కారణమని వారు అంటున్నారు. కాగా, పరిస్థితులు ఇలాగే సాగితే కేవలం నిర్మాణ రంగమేగాక, దాని అనుబంధ రంగాలూ సంక్షోభంలోకి జారుకుంటాయని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైడ్రా ఎఫెక్ట్
రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో హైడ్రా ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. హైదరాబాద్లో తెచ్చిన హైడ్రా.. ఇతర నగరాల్లోని లావాదేవీలపైనా గట్టి ప్రభావాన్నే చూపుతున్నది. ఇక రాజధానిలోనైతే హైడ్రా దెబ్బకు బయ్యర్లు.. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి వర్గాలు ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు కొనాలనే ఆలోచననే వాయిదా వేసుకుంటున్నారు. దీంతో కొత్త నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే పూర్తయిన ఇండ్లనూ కొనేవారు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడుల్ని రాబట్టుకొనేందుకు తక్కువ ధరలకు ఇస్తామన్నా ఆదరణే కరువైపోయింది. ఫలితంగా రియల్టర్లు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు.
దేశవ్యాప్తంగా..
హైదరాబాద్సహా మొత్తం దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ప్రాప్టైగర్.కామ్ తాజా సర్వే జరిగింది. ఇందులో ఢిల్లీ-ఎన్సీఆర్ మినహా మిగతా 7 నగరాల్లోనూ హౌజింగ్ సేల్స్ పతనమైనట్టు స్పష్టమైంది. అయితే టాప్-7 నగరాల్లో హైదరాబాద్లోనే అత్యధికంగా ఇండ్ల అమ్మకాలు తగ్గినట్టు తేలింది. కాగా, ఢిల్లీ-ఎన్సీఆర్లో 29 శాతం విక్రయాలు పెరిగాయి. గతంతో పోల్చితే 7,800 యూనిట్ల నుంచి 10,098 యూనిట్లకు ఎగిశాయి. కోల్కతాలో గరిష్ఠంగా 22 శాతం క్షీణించాయి. 3,607 యూనిట్ల నుంచి 2,796 యూనిట్లకు పడిపోయాయి. ఇక బెంగళూరులో 11 శాతం, అహ్మదాబాద్లో 9 శాతం, చెన్నైలో 8 శాతం, పుణెలో 3 శాతం, ముంబైలో 1 శాతం చొప్పున సేల్స్ దిగజారాయి.