కీవ్ మినహా ప్రధాన సిటీలు కైవసం
పోర్ట్ సిటీ ఒడెస్సాపై దాడులకు రెడీ
మరియుపోల్ నుంచి పౌరుల తరలింపులో రెండోరోజూ ఆటంకం
పోలండ్లో ఉక్రెయిన్ ప్రవాస సర్కార్ ఏర్పాటుకు అమెరికా ప్లాన్
వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం
10 రోజుల్లో 15 లక్షల మంది వలస ఐక్య రాజ్య సమితి వెల్లడి
ల్వీవ్, మార్చి 6: ఉక్రెయిన్ను రష్యా మెల్లమెల్లగా పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకొంటున్నది. రాజధాని కీవ్ మినహా దాదాపు అన్ని ప్రధాన నగరాలను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. ఖార్కీవ్, మైకోలైవ్, చెర్నీవ్, సుమీ, మరియపోల్, ఖేర్సన్ నగరాలు రష్యా స్వాధీనంలో ఉన్నాయి. ప్రముఖ తీర నగరం ఒడెస్సాను కూడా పూర్తిగా హస్తగతం చేసుకొనేందుకు రష్యా భారీ దాడులకు సిద్ధమవుతున్నది. నైకలేవ్లోని న్యూక్లియర్ ప్లాంటును స్వాధీనం చేసుకోవడానికి రష్యా బలగాలు కదులుతున్నాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్టారొకోన్స్టాంటినోవ్లోని ఉక్రెయిన్ ఎయిర్ ఫీల్డ్ను రష్యా బలగాలు నిర్వీర్యం చేశాయి. ఇక్కడ ఉన్న మూడు రాడార్ స్టేషన్లను, ఎస్-300 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయి. మరోవైపు విన్నిట్సియాలోని విమానాశ్రయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. మరియుపోల్, వోల్నవాఖా నగరాల్లో పౌరులను తరలించడానికి రష్యా ఆదివారం కూడా అవకాశం కల్పించింది. ఉదయం 10 గంటల నుంచి ఈ రెండు నగరాల్లో కాల్పులను ఆపివేశారు. రాత్రి 9 గంటల వరకు విరామం ఉంటుందని అధికారులు తొలుత ప్రకటించారు. అయితే రష్యా బాంబు దాడులు జరపడంతో పౌరుల తరలింపు ప్రక్రియ జరగలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. ఒక్క మరియపోల్లోనే 4.30 లక్షల మంది నగరాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా చెర్నోబిల్లో ఉక్రెయిన్ న్యూక్లియర్ డర్టీ బాంబును తయారుచేస్తున్నదని రష్యా ఆరోపించింది.
నేడు మూడో విడుత చర్చలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడో విడుత చర్చలు సోమవారం జరుగనున్నాయి. ఉక్రెయిన్లో మానవతా సాయం కోసం 10 బిలియన్ డాలర్ల సాయమందించాలని ఆమెరికా యోచిస్తున్నది. ఉక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలి సోమవారం మళ్లీ సమావేశం కానున్నది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఉదయం జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్కు ఫైటర్ జెట్లను అందజేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వైట్హౌస్ ప్రతినిధి చెప్పారు. మాస్టర్ కార్డు, వీసా, పే పాల్ సంస్థలు తమ సేవలను రష్యాలో నిలిపివేశాయి. పోలండ్లో జెలెన్స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్టు వాషింగ్టన్ పోస్టు కథనం వెలువరించింది.
నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించండి: జెలెన్స్కీ
ఉక్రెయిన్ను ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించాలని జెలెన్స్కీ ఆదివారం మరోసారి ఐరోపా దేశాలను అభ్యర్థించారు. ‘ప్రపంచ దేశాలకు ఆ శక్తి ఉంది’ అన్నారు. పుతిన్తో నేరుగా చర్చలు జరపడానికి జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా దాడులతో 15 లక్షలమందికి పైగా ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలస సంక్షోభం అని, ఉక్రెయిన్ నుంచి వలసలు వేగంగా పెరుగుతున్నాయని యూఎన్ హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి అన్నారు. గ్రాండి ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు, అన్ని దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో రష్యాలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఆహార పదార్థాల కొనుగోలుపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.
ఉక్రెయిన్ ప్రతినిధి రష్యా గూఢచారి?
ఉక్రెయిన్ తరఫున రష్యాతో శాంతి చర్చల్లో పాల్గొన్న అధికారి డెనిస్ కిరీవ్ను ఉక్రెయిన్ సైన్యం కాల్చి చంపింది. ఆయనను రష్యా గూఢచారిగా అనుమానిస్తున్నారు. అరెస్టు చేస్తుండగా ప్రతిఘటించడంతో కాల్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి విడుత శాంతి చర్చల్లో డెనిస్ పాల్గొనలేదు. ఇదిలా ఉండగా, రష్యా ఆక్రమణను వ్యతిరేకిస్తూ బెలారస్ రక్షణ శాఖ మంత్రి మేజర్ జనరల్ విక్టర్ గులేవిచ్ రాజీనామా చేశారు. రష్యా మారణహోమంతో తాను భాగస్వామి కాదల్చుకోలేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
పుతిన్కు మీరైనా చెప్పండి..
సైనిక చర్యను ఆపేలా రష్యాపై భారత్ ఒత్తిడి తీసుకురావాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజప్తి చేశారు. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సంబంధాలున్న భారత్ సహా ఇతర దేశాలు యుద్ధాన్ని ఆపేలా వారికి నచ్చజెప్పాలి. యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది’ అని అన్నారు.