80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నది. స్వరాష్ట్రంలో ఉద్యోగం సాధించేందుకు భారీ అవకాశం వచ్చిందని సంబురపడుతున్నది. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధించిన యువత పలు సూచనలిస్తున్నది. కన్ఫ్యూజన్ లేకుండా కష్టపడి చదివితే కల నెరవేర్చుకోవచ్చని చెబుతున్నది. స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే ప్రభుత్వ ఉద్యోగం తథ్యమని అంటున్నది. వారి విజయానికి ఎలా కష్టపడ్డారో ‘నమస్తే’తో పంచుకున్నారు.
మాది పెగడపల్లి మండలం కీచులాటపల్లి. పెద్దగా భూమి జాగల్లేవు. ఆస్తిపాస్తులు లేవు. అక్క, అన్న, నేను చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోనే పెరిగాం. గోపాల్రావుపేటలో పదో తరగతి పూర్తి చేశా. నా కోసం అన్న అమరేందర్రెడ్డి తన చదువు త్యాగం చేసిండు. ఆయన ఆర్థిక సహకారం, ప్రోత్సాహంతో కామర్స్లో బీకామ్ పూర్తి చేశా. ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అంతలోనే 2017లో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా. త్రుటిలో ఎస్ఐ పోస్టు మిస్సయ్యింది. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆక్టోపస్లో పనిచేశా. 2018లో ఎస్ఐ ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్ రావడంతో ఈ సారి ఎలాగైనా సాధించాలని అనుకున్నా. కసితో ప్రిపేరయ్యా. ఫిజికల్ ఈవెంట్లపై ఎక్కువ స్కోర్ చేసేందుకు ప్రయత్నించా. ఏఆర్ విభాగంలో ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యా. ప్రస్తుతం జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్నా. నా కోసం చదువును త్యాగం చేసి, నన్ను ఈ స్థితికి చేర్చిన మా అన్నయ్యకు జీవితాంతం రుణపడి ఉంటా.
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో ఒక్కొక్కరూ ఒకటి కంటే ఎక్కువే ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. స్థానికతకు పెద్దపీట వేసిన ఈ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనే కన్ఫ్యూజన్ వద్దు. కోచింగ్ లేకుండా సర్కారు కొలువు రాదనే అపోహ అంతకంటే అక్కర్లేదు. కష్టపడి ప్రణాళికబద్ధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం పక్కా అని గుర్తుంచుకోవాలి. నిరుద్యోగులకు ప్రొత్సాహం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విజేతల అనుభవ పాఠాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– రాంనగర్, మార్చి 11
నా పేరు ద్యావనపల్లి స్రవంతి. రామరావుపల్లి, మండలం చందుర్తి. మొదటి ప్రయత్నంలోనే నా భర్త ఆయిల్నేని శ్రీనివాస్రావు సహకారంతో గ్రూప్-2 ఉద్యోగం సాధించా. పదో తరగతి వరకు మా గ్రామంలోనే చదివా. ఇంటర్ కరీంనగర్లోని అల్ఫోర్స్ కళాశాల, డిగ్రీ శ్రీచైతన్య కళాశాల, ఎమ్మెసీ కెమిస్ట్రీ హైదరాబాద్లో పూర్తి చేశా. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదలైన మొదటి గ్రూప్-2 నోటిఫికేషన్కు సిద్ధమయ్యా. 2016 నవంబర్లో పరీక్షలు రాశా. 2019లో పోస్టింగ్ వచ్చింది. సెక్రటేరియట్లో ఉన్నత విద్య డిపార్ట్మెంట్లో ఏఎస్వో (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)గా విధుల్లో చేరాను. పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం కూడా వచ్చింది. ఎలాంటి కోచింగ్ లేకుండా రోజు 8 నుంచి 9 గంటలు ప్రిపేర్ అయ్యేదాన్ని. కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది.
– ద్యావ స్రవంతి, రామరావుపల్లి, చందుర్తి మండలం (రాజన్న సిరిసిల్ల జిల్లా)
2011లో కానిస్టేబుల్గా ఎంపికై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ పీఆర్వోగా పనిచేశా. ఆఫీసర్ స్థాయిలో ఉండాలన్న కోరికతో మళ్లీ సాధన మొదలు పెట్టా. 2018 నోటిఫికేషన్ రాగానే కొత్త పరీక్షా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ఫిట్నెస్పై పట్టు పోకుండా, రాత పరీక్షలపై పట్టు సాధించేందుకు శ్రమించా. ప్రతి ఒక్కరూ ప్రిలిమ్స్, మెయిన్స్ను వేర్వేరుగా ప్రిపేరవ్వడం చూసి అది సరికాదని గుర్తించా. రెండింటికీ ఒకేసారి ప్రిపేరయితే సులభంగా సాధించవచ్చని నిర్ణయించుకొని ఆ దిశగా ముందడుగు వేశా. ఉదయం పూట ఫిజికల్ ఫిట్నెస్, మిగతా సమయం పుస్తకాలపై దృష్టి సారించి, విజయం సాధించా. ఏఆర్ఎస్ఐగా ఎంపికై కరీంనగర్లో పనిచేస్తున్నా.
-మనోహర్, ఏఆర్ ఎస్ఐ (రాంగనర్)
మాది వేములవాడ మండలం రుద్రవరం. మా తండ్రి మంద బాలయ్య, తల్లి భారతి. నేను పదో తరగతి కరీంనగర్లోని సిద్ధార్థ హైస్కూల్లో 2007లో పూర్తి చేశా. బీటెక్ హైదరాబాద్లో చదివా. మొదటిసారి పంచాయతీ సెక్రటరీగా 2019 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2019 వరకు 6 నెలల పాలు కోనరావుపేట మండలంలో పనిచేశా. తర్వాత 2016 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 2019లో ఫలితాలు ప్రకటించగా 2020 జనవరి 23న ఎక్సైజ్ ఎస్ఐగా విధుల్లో చేరా. నేను, మా కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– మంద శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్ఐ, కరీంనగర్ (వేములవాడటౌన్)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అల్లం రాజమౌళి -లక్ష్మి దంపతుల కుమారుడు అల్లం రమేశ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రమేశ్ కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, డిగ్రీ వరకు ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నాడు. తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులు చేస్తున్న రమేశ్ ఎస్ఐ కావాలనుకున్నాడు. పీఈటీ సార్ లక్ష్మీనారాయణ ప్రోత్సాహంతో కోకో, అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. మరోవైపు కరీంనగర్లోని ఓ పోలీస్ అకాడమీలో ఎస్ఐ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నాడు. టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ నోటిఫికేషన్ మెయిన్ పరీక్షలో మంచి మార్కులు పొంది 2019 జూలై 11న ఎస్ఐ జాబ్కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
– అల్లం రమేశ్, ఎస్ఐ, కోరుట్ల (జగిత్యాల జిల్లా)