పెన్పహాడ్, సెప్టెంబర్ 03 : చదువును ఆయుధంగా చేసుకుంటే పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్కు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం, భద్రత, మెరుగైన వసతులు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యాబోధన, వసతులు, విద్యార్థుల సంక్షేమం, వంటశాల, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
విద్యార్థుల చదువు, భోజనం, వసతులు ఎలా ఉన్నాయని కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుతున్న భోజనం, మెనూ అమలు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ వివరించారు.
చదువుతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారి లక్ష్యాలను చేరుకునేలా ఉపాధ్యాయులు నిరంతరం మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలన్నారు.
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారిలో సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అనంతారం గ్రామంలో సమగ్ర ఓటర్ ప్రక్రియ ను ఆయన పరిశీలించారు. ఎన్యుమరేషన్లో మ్యాపింగ్ కాని ఓటర్లతో పాటు వివరాలు తప్పుగా ఉన్న ఓటర్లకు సక్రమంగా నోటీసులు అందుతున్నాయా? లేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ రాజశేఖర్ రెడ్డి. ఆర్ ఐ రంజిత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సోమయ్య, ప్రధాన ఉపాధ్యాయులు మల్లారెడ్డి, జీపీఓ చంద్రకళ, బీఎల్ఓలు, గద్దల శైలేజ, మామిడి వసంత పాల్గొన్నారు.

చదువుతో జీవితంలో ఉన్నత శిఖరాలు : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్