న్యూఢిల్లీ, డిసెంబర్ 7: చలామణిలో రూ.2,000 నోట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది నవంబర్లో సర్క్యులేషన్లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2వేల నోట్ల సంఖ్య 223.3 కోట్లేనని మంగళవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి చెప్పారు. ఇది 1.75 శాతానికి సమానమని పేర్కొన్నారు. 2018 మార్చిలో 336.3 కోట్ల (3.27 శాతం) రూ.2వేల నోట్లున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సంప్రదించి నోట్ల ముద్రణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నల్లధనం వెలికితీత పేరుతో 2016 నవంబర్ 8న పాత రూ.500, రూ.1,000 నోట్లను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వీటి స్థానంలో కొత్త రూ.500, రూ.2,000 నోట్లను పరిచయం చేసిన సంగతీ విదితమే. వీటితోపాటు రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 డినామినేషన్లలోనూ కొత్త కరెన్సీని తెచ్చారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈ ప్రక్రియ నిలిచిందంటూ సాక్షాత్తూ ఆర్బీఐనే ప్రకటించడం కొసమెరుపు. కాగా, గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో మోసాలు, ఎగవేతల కేసులకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.4.18 లక్షల కోట్లకుపైగా రికవరీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మరో సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు తెలిపారు.
ఇదిలావుంటే గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో నిబంధనలను పాటించని సుమారు 4 లక్షల సంస్థల గుర్తింపును రద్దు చేశామని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ చెప్పారు. ఇక దివాలా చట్టం కింద ఈ సెప్టెంబర్ నాటికి 421 కేసుల పరిష్కారం జరిగిందని, 1,149 కేసులు లిక్విడేషన్కు వెళ్లాయని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు.