రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. 70, 80వ దశకాల్లో పోలీసులను, ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్గా ఈ సినిమా తెరకెకుతున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు వంశీ. బాలీవుడ్ తార నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్కు సిద్ధమవుతున్నది. ఈ సినిమా కోసం స్టువర్ట్పురం గ్రామ సెట్ను భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. 70వ దశకం వాతావరణాన్ని తలపించేలా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఈ గ్రామ సెట్ను తీర్చిదిద్దుతున్నారు. శంషాబాద్ సమీపంలోని ఐదెకరాల స్థలంలో దాదాపు 7 కోట్ల రూపాయల ఖర్చుతో సెట్ నిర్మాణం జరుగుతున్నది. ఈ విలేజ్ సెట్లోనే మేజర్ షూటింగ్ జరుపనున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతున్నది. రాబిన్హుడ్ లాంటి దొంగ చేసే సాహసాలతో టైగర్ నాగేశ్వరరావు మూవీ ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతున్నారు.