అగ్ర కథానాయిక రష్మిక మందన్న గొప్ప చదువరి. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైన ఈ అమ్మడికి వ్యక్తిత్వ వికాసం తాలూకు పుస్తకాలపై మంచి అవగాహన ఉంది. తన సోషల్మీడియా ఖాతాల్లో సందర్భాన్ని బట్టి స్ఫూర్తివంతమైన మాటల్ని పోస్ట్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటుంది. తాజాగా ఈ సొగసరి భయాల్ని ఎలా జయించాలో తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటున్నది. ‘భయాల తాలూకు అగ్నిగుండాల మధ్య నుంచి సురక్షితంగా నడచివెళ్లాలనుకుంటున్నారా? అయితే తొలుత ఆ భయాలేమిటో తెలుసుకోండి. ఒకరితో పోల్చుకొని కృంగిపోతున్నారా? అనవసరంగా ఆందోళనకు గురవుతున్నారా? ఇతరులు మన తప్పుల్ని ఎంచుతారేమోనని దిగులుపడుతున్నారా?..ఇలాంటివే మీ భయాలైతే వాటి ప్రాంగణాల్లోకి ధైర్యంగా అడుగువేయండి. మీ మానసిక శక్తులకు పదునుపెడుతూ వాటిని ఎలా అధిగమించాలో సాధన చేయండి. కొద్ది రోజుల్లోనే ఫలితాన్ని చూస్తారు. అంత చిన్న విషయాలకు భయపడ్డానా? అని మీరే ఆశ్చర్యపడతారు. నేను కథానాయికగా రాణించడానికి ప్రధాన కారణం నాలోని భయాల్ని జయించడమే’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తున్నది.