న్యూఢిల్లీ, నవంబర్ 13: ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అరుదైన కేసు నమోదైంది. డెంగ్యూ నుంచి కోలుకున్న వ్యక్తి మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ఫంగస్) బారినపడినట్టు వైద్యుల బృందం శనివారం వెల్లడించింది. డెంగ్యూ నుంచి కోలుకున్న 49 ఏండ్ల వ్యక్తి తన కంటిచూపు కోల్పోవడంతో తిరిగి దవాఖానకు వచ్చారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్లాక్ఫంగస్ బారినపడినట్టు వైద్యుల బృందం పేర్కొన్నది. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామంది రోగులు బ్లాక్ఫంగస్ బారిన పడ్డారు. అయితే, డెంగ్యూ జ్వరం నుంచి కోలుకున్న 15 రోజుల తర్వాత సదరు వ్యక్తిలో బ్లాస్ఫంగస్ బయటపడటం అత్యంత అరుదైన కేసుగా డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలో ఈ సీజన్లో నవంబర్ 6 వరకు 2,708 డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఇందులో తొమ్మిది మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ఒక్క నవంబర్ మొదటివారంలో 1,170 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.