‘బాహుబలి’ ‘పుష్ప’ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు సాధించిన అపూర్వ విజయాలతో తెలుగు సినిమా పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. బాక్సాఫీస్ వద్ద కూడా జాతీయ రికార్డులను తిరగరాస్తూ తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర హీరోలు కూడా తెలుగు చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని ప్రదర్శి స్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప-2’ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరో రణ్వీర్సింగ్ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప-2’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇందులో అల్లు అర్జున్ను పరిచయం చేసే పోలీసాఫీసర్గా రణ్వీర్సింగ్ కనిపిస్తారని సమాచారం. నిడివి చిన్నదే అయినా కథాగమనంలో ఆయన పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు. ఇదిలావుండగా మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతున్నది.