బొంరాస్పేట, ఆగస్టు 7: మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఓ న్యాయవాది తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడినై ఉండి, తన పిల్లలు ప్రైవేటుకు పోతే ఎలా? సర్కారు బడులపై తల్లిదండ్రులకు నమ్మకం కలుగాలంటే తన పిల్లలు కూడా ప్రభుత్వ బడిలోనే చదవాలని భావించారు మండలంలోని రేగడిమైలారం గ్రామానికి చెందిన వెంకటయ్య. ఆయన బొంరాస్పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్గా పని చేస్తూ తన ఇద్దరి పిల్లలను కూడా తాను పని చేస్తున్న ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని భావించిన దుద్యాల మండల కేంద్రానికి చెందిన లాయర్ శకనప్ప కూడా తన కుమార్తె శ్రీవర్షను ఈ విద్యాసంవత్సరం నుంచి గ్రామంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలలో ఒకటోతరగతిలో చేర్పించాడు. వెంకటయ్యకు అక్షరకృప, ధారవి అభ్యాస్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వారిని ఐదో తరగతి వర కు కొడంగల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించాడు.
ప్రైవేట్ విద్యాభ్యాసం నచ్చక ..ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని భావించిన అతడు తాను పని చేస్తున్న బొంరాస్పేటలోని జడ్పీహెచ్ఎస్లో చేర్పించా డు. అక్షరకృపను 2018లో ఆరోతరగతిలో చేర్పించగా ప్రస్తుతం టెన్త్ చదువుతున్నది. ధారవి అభ్యాస్ను 2020లో ఆరోతరగతిలో చేర్పించగా అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వెంకటయ్య తన పిల్లలను ప్రభుత్వ బడిలో చది విస్తుండటంతో గ్రామస్తులకు నమ్మకం కలిగి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు మాన్పించి సర్కారు బడికే పంపించ డం ప్రారంభించారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇందుకు ఉపాధ్యాయుడు చేసిన కృషికి సహచర ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా మరింత బలాన్నిచ్చింది.
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య..
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నది. అందుకే తన ఇద్దరు పిల్లలను తాను పని చేస్తున్న బొంరాస్పేటలోని జడ్పీహెచ్ఎస్లో చేర్పించా. ప్రభు త్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠా లను చాలా చక్కగా బోధిస్తున్నారు. తన పిల్లలను ఐదో తరగతి వరకు ప్రైవేట్లో చదివించినా నాకు సంతృప్తి కలగలేదు.
– వెంకటయ్య, తెలుగు పండిత్
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు బాగున్నాయి..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమా న్ని ప్రవేశపెట్టింది. శిక్షణ పొందిన టీచర్లతో నాణ్యమైన విద్యను అందిసున్నది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం, ఉచితంగా యూనిఫాంలను అందిస్తున్నది.
-శకనప్ప, అడ్వకేట్ దుద్యాల