ఇబ్రహీంపట్నం టెక్స్టైల్ హబ్గా మారుతున్నది. ఇక్కడున్న వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్ పార్కులో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు టెక్స్టైల్ రంగం దిగ్గజాలు ముందుకొస్తున్నాయి. టెక్స్టైల్ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్ వద్ద 138 ఎకరాల భూమిని కేటాయించింది. అంతేకాకుండా ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసే కంపెనీలకు విద్యుత్, నీటివసతి, రుణం తదితర సౌకర్యాలను కల్పించి ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం సూరత్కు చెందిన దివ్య టెక్స్టైల్ ఇండస్ట్రీని ఇక్కడ ప్రారంభించింది. త్వరలోనే మరో నాలుగు కొత్త సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అందుకు అవసరమైన గోదాంలను నిర్మించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పేరుగాంచిన జేసీ బ్రదర్స్, చందనబ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ తదితర టెక్స్టైల్ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 22 : రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం త్వరలో టెక్స్టైల్ హబ్గా మారనున్నది. దేశంలోనే పలు టెక్స్టైల్ కంపెనీలు ఇబ్రహీంపట్నం సమీపంలోని వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్లో తమ సంస్థను ప్రారంభించడానికి ముందుకొస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని పలు టెక్స్టైల్ రంగ దిగ్గజాలు ఇక్కడ సంస్థలను ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం 138 ఎకరాల భూమిని కేటాయించింది. వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ కంపెనీతో ఇక్కడ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి నాగన్పల్లికి వెళ్లే రోడ్డులో అతి ఖరీదైన భూమి ప్రభుత్వం టెక్స్ టైల్ రంగ కంపెనీలకు కేటాయించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూమిని కేటాయించినప్పటికీ అప్పటి ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో టెక్స్టైల్పార్కుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెక్స్టైల్ కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే వ్యాపారులకు విద్యుత్, నీటివసతితో పాటు రుణ సౌకర్యాలనూ కల్పించడంతో పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటికే గుజరాత్లోని సూరత్కు చెందిన దివ్య టెక్స్టైల్ ఇండస్ట్రీని ఇక్కడ ప్రారంభించారు. ఈ టెక్స్టైల్ ప్రారంభంలోనే మంచి పేరును సంపాదించింది. ఇక్కడ ఏర్పాటయ్యే టెక్స్టైల్ సంస్థల కోసం అతిపెద్ద సబ్స్టేషన్ ఏర్పాటు చేసి 24 గంటల విద్యుత్ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైట్గోల్డ్లో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ కంపెనీల కోసం అవసరమైన నీటిని మిషన్భగీరథతో అందిస్తున్నారు.
త్వరలో నాలుగు టెక్స్టైల్ పార్కులు ప్రారంభం..
ఇబ్రహీంపట్నం సమీపంలోని వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ప్రాంతంలో మరో నాలుగు టెక్స్టైల్ కంపెనీలు ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. అవసరమైన గోడౌన్లనూ పూర్తి చేశారు. రెండు టెక్స్టైల్ కంపెనీల గోడౌన్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో పేరున్న జేసీ బ్రదర్స్, చందనబ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ తదితర టెక్స్టైల్ సంస్థలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నారు. మరిన్ని సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూములను టీఎస్ఐఐసీ కేటాయిస్తున్నది.
టెక్స్టైల్ పార్కుతో స్థానికులకు ఉపాధి..
ఇబ్రహీంపట్నం సమీపంలోని వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ కంపెనీలు ప్రారంభమైతే ఈ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒక్కో కంపెనీలో 100 నుంచి 300 మంది వరకు పని చేయనున్నారు. ఇందులో ఎక్కువమంది స్థానిక మహిళలతో పాటు యువతీ యువకులకూ ఉద్యోగావకాశాలు కల్పించాలని సంస్థల యజమానులు
నిర్ణయించారు.
విజయవంతంగా దివ్య టెక్స్టైల్ కంపెనీని..
వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్లో ఇప్పటికే గుజరాత్లోని సూరత్కు చెందిన దివ్య టెక్స్టైల్ కంపెనీని ఇక్కడ ప్రారంభించారు. ప్రారంభంలోనే ఈ టెక్స్టైల్ సంస్థలో రోజుకు 1000 నుంచి 1500 చీరలను తయారు చేసి గుజరాత్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ టెక్స్టైల్ కంపెనీలో తయారయ్యే చీరలకు పూర్తి ముడిసరుకును సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ తయారయ్యే చీరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ. 500 నుంచి రూ.1000కే అందిస్తున్నారు. ఈ టెక్స్టైల్ సంస్థలో ప్రతిరోజు 60 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ టెక్స్టైల్ కంపెనీలో సిల్క్, బనారస్ తదితర చీరలను తయారు చేస్తున్నారు.
దేశం నలుమూలలకు ఇబ్రహీంపట్నం చీరలు
ప్రస్తుతం ఇబ్రహీంపట్నం వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్లో ప్రారంభమైన దివ్య టెక్స్టైల్ చీరలకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ టెక్స్టైల్లో సిల్క్, బనారస్ తదితర చీరలను తయారు చేస్తున్నారు. ఈ చీరలు హైదరాబాద్తో పాటు దేశంలోని అనేక ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ ధరలకు కాకుండా సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా చీరలను తయారు చేస్తున్నారు. దివ్య టెక్స్టైల్లో ప్రతిరోజు వెయ్యి నుంచి పదిహేనువందల చీరలు తయారవుతున్నాయి.
తక్కువ ధరకే చీరలు..
ఇబ్రహీంపట్నంలోని వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్లోని దివ్య టెక్స్టైల్లో తయారయ్యే చీరల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఈ చీరలను సూరత్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కోల్కత్తా వంటి ముఖ్య నగరాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇక్కడ టెక్స్టైల్ కంపెనీలు మరిన్ని ప్రారంభమైతే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
స్థానికులకు ఉపాధి..
వైట్గోల్డ్ టైక్స్టైల్ పార్కులో టైక్స్టైల్ కంపెనీలు ప్రారంభమైతే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఐటీ రంగం ఉరకలు వేస్తోంది. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కుతో ఎంతో మంది టెక్స్టైల్ రంగం దిగ్గజాలకు అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతో తోడ్పాటునిస్తున్నది.