చేవెళ్ల రూరల్, నవంబర్ 16 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం గ్రామాల్లో పూర్తి స్థాయిలో అమలవుతున్నది. నేడు పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతన్నాయి. ప్రతి ఇంటి ఎదుట నాటిన పచ్చని మొక్కలు స్వాగత తోరణాలుగా దర్శనమిస్తున్నాయి. చేవెళ్ల మండలం రావులపల్లి గ్రామంలో ఇప్పటి వరకు 9000వేల మొక్కలు నాటి వాటిని రక్షిస్తున్నారు. గ్రామ సర్పంచ్ కేసారం శ్రీనివాస్, సెక్రటరీ లావణ్య ప్రత్యేక శ్రద్ధ వహించి హరితహారంలో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు.
లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు..
హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి పచ్చదనం దర్శనమిచ్చేలా పాటుపడుతున్నారు. ఇప్పటి వరకు రావులపల్లి గ్రామంలో మొత్తం 9000 మొక్కలు నాటి పెంచుతున్నారు. పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామ ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు పచ్చని తోరణాలుగా దర్శనమిస్తున్నాయి.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
గ్రామంలో ఇప్పటి వరకు హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ట్రీగార్డులు ఏర్పాటు చేసి వాటి మధ్యలో చెత్తాచెదారం తొలగిస్తున్నాం. గ్రామస్తుల సహకారం, అధికారుల చొరవతోనే హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకున్నాం.
పచ్చదనానికి అధిక ప్రాధాన్యం
గ్రామంలో పచ్చదనం పెంపొందించడంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నాటిన ప్రతి మొక్కనూ కాపాడుతున్నాం. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటేలా అవగాహన కల్పిస్తున్నాం.