ఇంగ్లిష్ రావడం వల్లే తాను యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కాగలిగానని, తనకున్న అర్హతలకు తోడు ఇంగ్లిష్ అదనపు బలం చేకూర్చిందని మహారాష్ట్రలోని రాంటెక్ సంస్కృత యూనివర్సిటీ వీసీ పెన్నా మధుసూదన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన’, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లిష్లో ప్రావీణ్యం తప్పనిసరిగా మారిందని అన్నారు. ప్రాథమిక దశ నుంచే ఆంగ్లంలో చదివేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించడం అద్భుతమని వర్ణించారు. తన ఎదుగుదలకు ఇంగ్లిష్ ఏ విధంగా దోహదం చేసిందనే అంశాలను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ తప్పనిసరి
నల్గొండ జిల్లా నకిరేకల్లో పాఠశాల విద్య, ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసుకొని మహారాష్ట్రలోని సంస్కృత యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరాను. ఇటీవల నన్ను వర్సిటీకి వీసీగా నియమించారు. వాస్తవానికి నా కన్నా చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ అనుభవం, పనిపై శ్రద్ధ, నా రచనలు వీసీగా నియమించడానికి ఒక కారణం. మరో ప్రధాన కారణం ఇంగ్లిష్పై పట్టు ఉండటం. ఆ పదవికి అర్హులైన వారిలో ఇంగ్లిష్లో ప్రావీణ్యం నాకు మాత్రమే ఉండటంతో అవకాశం వచ్చింది. ప్రస్తుత సాంకేతిక, పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ తప్పనిసరిగా మారింది. లేకుంటే విద్యార్థులు పోటీ పడలేరు, అనుకున్నది సాధించలేరు. చాలామందికి తెలివితేటలు ఉన్నప్పటికీ ఇంగిష్పై పట్టులేక వెనుకబడిపోతున్నారు. ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా మారిపోయింది. ఇంగ్లిష్తో పాటు మాతృభాషను కూడా బోధించాలి. అప్పుడే సమర్థులుగా తయారవుతారు.
సొంతంగా ఇంగ్లిష్ నేర్చుకున్నా
నేను ఎప్పుడూ ఆంగ్ల మాధ్యమంలో చదువలేదు. చదువంతా తెలుగు మీడియంలోనే సాగింది. సంస్కృతాన్ని ఎంచుకొని పీజీ పూర్తిచేశా. తర్వాత ఇంగ్లిష్తోనే ఎదుగుదల ఉంటుందని పట్టుదలతో నేర్చుకున్నా. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కొన్ని ఇంగ్లిష్ నవలలు చదవడం, గ్రామర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా పట్టు సాధించా. ఇప్పుడు తడబాటు లేకుండా అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడగలను, రాయగలను. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించాలనే నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఈ ఒక్క కార్యక్రమంతో ప్రభుత్వ బడులకు పట్టిన దరిద్రం తుడిచిపెట్టుకుపోయి.. మహర్దశ వస్తుంది. బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తుండటం మరో గొప్ప నిర్ణయం. విద్యార్థుల తలరాతను బడులు మార్చితే.. బడుల రాతను మన ఊరు-మన బడి మార్చనున్నది.
పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు
ప్రభుత్వ బడులపై కొంత చిన్నచూపు, చులకన భా వం ఉన్నది. వాటిల్లో పేదలే చేరుతారని, ప్రతిభ తక్కువనే అభిప్రాయం ఉన్నది. కానీ, ఇది పూర్తిగా అబద్ధం. దానికి నేను కూడా ఒక ఉదాహరణ. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న చాలామంది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్నవారే. జీవితంలో అవసరా న్ని బట్టి ఆయా భాషలను నేర్చుకుంటారు. గతంలో అవసరం లేదనో, ఇతర కారణాలతో విద్యార్థులకు సౌకర్యాలను కల్పించలేకపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గొప్ప మార్పునకు పూనుకొన్నది. దీంతో పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డట్టే. ఏదో కోల్పోయాననే భావన పిల్లల్లో ఇకపై రాదు.
తల్లిదండ్రులకు గొప్ప ఉపశమనం
తామెలాగూ మంచి చదువులు చదవలేదని, పిల్లలనైనా చదివించాలనే ఉద్దేశంతో కష్టమైనా అనేక మంది పేరెంట్స్ తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. కూలి పనిచేసే వాళ్లు కూడా స్థోమతకు మించి ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో మంది పేద తల్లిదండ్రులకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. వారి పిల్లలను సంతోషంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు.
మూతపడే బడిని తెరిపించిన ఆంగ్లం
దేవరుప్పుల, జనవరి 27: ఒకప్పుడు పేరుమోసిన పాఠశాల ఇది. ఎందరికో చదువు నేర్పి ఉన్నతులుగా, మేధావులుగా తీర్చిదిద్దిన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలపై ఆంగ్లభాష ప్రభావం పడింది. 2018-19లో ఉపాధ్యాయులు ఆరుగురు ఉంటే విద్యార్థులు ఎనిమిది మందే ఉండటంతో స్కూల్ మూతపడే దుస్థితి వచ్చింది. గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఎలాగైనా బడిని బతికించుకోవాలని భా వించారు. అంతా ఏకమై పాఠశాలలో ఐదోతరగతి వరకు ఆంగ్ల బోధనకు అనుమతి తెచ్చారు. ఈ వి షయాన్ని పాఠశాల యాజమాన్యం ఇల్లిల్లూ తిరిగి తాము ఆంగ్ల భాషలోనే బోధన చేస్తామని, పిల్లలకు మెరుగైన విద్యనందించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. దీంతో 2019-20 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 49కి పెరిగింది. ఈ క్రమంలో పాఠశాలలో మంచి ఫలితాలు రావడంతో తల్లిదండ్రులకు పాఠశాలపై నమ్మకం పెరిగింది. 2020-21 విద్యాసంవత్సంలో ఏకంగా విద్యార్థుల సంఖ్య 85 చేరింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ సంఖ్య 125కు చేరుతుందని ప్రధానోపాధ్యాయుడు అశోక్ యాదవ్ భరోసాతో చెప్తున్నారు.