పురాణ గాథలు కాలక్షేపానికి చదువుకునేవి కావు. ఊసుపోక చెప్పుకొనేవీ కావు. పురాణ ఐతిహ్యాల్లోని కథలు నవజీవన సూత్రాలు. మనిషి నడవడిని తీర్చిదిద్దే మంత్రాలు. రామాయణంలోని కొన్ని పాత్రలు ఎలా మసలుకోవాలో చెప్తే, మరికొన్ని ఎలా ఉండకూడదో హెచ్చరిస్తాయి.
సంపాతి, జటాయువు గరుత్మంతుడి అన్న అనూరుడి కొడుకులు. రెండూ సోదర ప్రేమతో, పరస్పరం ఆదరభావంతో జీవనం సాగించేవి. ఒకసారి ఇద్దరిలో ఎవరి బలం ఎక్కువ? అన్న ప్రశ్న తలెత్తింది. సరదాగా మొదలైన సంవాదం చిలికి చిలికి వివాదంగా పరిణమించింది. ‘నేను గొప్ప’ అంటే ‘నేనే గొప్ప’ అని కలహించుకున్నాయి. ఎవరి సామర్థ్యం ఎంతో నిరూపించుకోవాలనుకున్నాయి. ‘ఎవరు ఎక్కువ ఎత్తు ఎగిరితే వాళ్లే గొప్ప’ అని పోటీ పెట్టుకున్నాయి. రెండూ రివ్వున గాల్లోకి లేచాయి. రెక్కల బలం కొద్దీ వినువీధుల్లో విహరించడం మొదలుపెట్టాయి. ఒకరిని తోసిరాజని మరొకరు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. రోదసిలోకి వెళ్లాక కూడా పంతం వీడలేదు. సత్తువ కొద్దీ ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇంతలో సంపాతికి సూర్యుడి వేడి చురుక్కున తాకింది. లక్ష్యపెట్టక మరికాస్త పైకి ఎగిరింది. భానుడి భగభగలు సంపాతి, జటాయువు రెక్కలను కాల్చడం మొదలుపెట్టాయి. జటాయువు రెక్కలు కాలిపోకుండా సంపాతి రక్షణగా నిలుస్తాడు. దాంతో సంపాతిరెక్కలు కాలిపోతాయి. పైనుంచి పడే క్రమంలో సంపాతి రెక్కలు పూర్తిగా కాలిపోయి దక్షిణ సముద్రతీరంలో పడిపోయింది. చావు తప్పి దుర్భరమైన జీవితం కొనితెచ్చుకుంది. జటాయువు కూడా అన్నను కోల్పోయి దండకారణ్యంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఈ ఇద్దరు సోదరుల మధ్య వైరం పొడచూపకపోయి ఉంటే, వారికీ దుస్థితి దాపురించేది కాదు. రామకార్యంలో ప్రాణాలు విడిచి జటాయువు మోక్షం పొందడం, వానరులకు సీతమ్మ జాడ తెలిపిన సంపాతికి మళ్లీ రెక్కలు రావడం.. వాటి పశ్చాత్తాపానికి కలిగిన ప్రయోజనమే.
రామాయణంలో మరో అన్నదమ్ముల జోడి వాలి, సుగ్రీవులు. ఇద్దరూ రెండు దేహాలు, ఒకే ప్రాణంగా మెలిగేవారు. కానీ, వారిద్దరి మధ్యా విభేదాలు పొడచూపాయి. ఓ రాక్షసుణ్ని తరుముతూ వాలి గుహలోకి వెళ్లడం, ఎన్ని రోజులైనా రాకపోవడంతో లాభం లేదని గుహ ద్వారం మూసి సుగ్రీవుడు వానర రాజు కావడం జరిగిపోయాయి. వాలి తిరిగివచ్చి, సుగ్రీవుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఏతావాతా ఇద్దరి మధ్యా ఒకరినొకరు చంపుకొనేంత వైరం ఏర్పడింది. ధర్మం సుగ్రీవుడి వైపు ఉండటంతో రాముడు అతని పక్షాన నిలిచాడు. వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజుగా చేశాడు. వాలి, సుగ్రీవులు మనస్ఫూర్తిగా కలిసి ఉంటే ఈ పరిస్థితే ఉత్పన్నమయ్యేది కాదు!
సోదర త్రయం రావణ, కుంభకర్ణ, విభీషణులు సైతం ఎంతో అభిమానంతో మెలిగేవారు. స్వతహాగా రావణుడు బలశాలి కావడంతో కుంభకర్ణ, విభీషణులు ఆయన మాటకు అడ్డుచెప్పిన సందర్భాలుండేవి కావు. అయితే, సీతాదేవి అపహరణ తర్వాత అన్న హితం కోరి ఆమెను విడిచి పెట్టాల్సిందిగా కోరుతాడు విభీషణుడు. రావణుడు పెడచెవిన పెట్టడంతో సోదరుణ్ని కాదని అతని వైరిపక్షంలో చేరుతాడు. ఇదే విషయమై కుంభకర్ణుడూ రావణుడికి హితవు చెప్తాడు. ఆ మాటలనూ ఆలకించడు రావణుడు. చివరికి బయటికి పొక్కిన ఇంటి గుట్టు లంకకు చేటు చేసినట్లయింది.
ఇదే రామాయణంలో రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడి మధ్య సోదర ప్రేమ యుగయుగాలకూ ఆదర్శంగా నిలిచింది. ఎవరు ఎన్నిరకాల ప్రయత్నించినా వారి మధ్య ఉన్న అనుబంధం కొడిగట్టలేదు. అందుకే సోదర ప్రేమ అనగానే దశరథ నందనులు గుర్తుకువస్తారు. కలిసి ఉండటమే వారి బలం. భౌతికంగా కొన్నాళ్లు దూరంగా ఉన్నా, ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం, వాత్సల్యం కోల్పోలేదు. అదే వారిని నిలబెట్టింది. కలిసి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాన్ని లోకానికి చాటిచెప్పింది.