ముంబై : మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే అల్టిమేటం జారీ చేసిన క్రమంలో ఆయనకు ఉర్దూలో బెదిరింపు లేఖ అందడం కలకలం రేపింది. రాజ్ ఠాక్రే ప్రాణానికి ముప్పు ఉందని ఆయనకు బెదిరింపు లేఖ వచ్చిందని ఎంఎన్ఎస్ నేత బాలా నందగంకర్ బుధవారం వెల్లడించారు.
బాల మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వల్సె పాటిల్ను కలిసి బెదిరింపు లేఖ విషయం వివరించారు. ఎంఎన్ఎస్ చీఫ్కు ఏమైనా జరిగితే తాము మహారాష్ట్రలో అగ్గి రేపుతామని అన్నారు. లౌడ్స్పీకర్ వివాదానికి సంబంధించి ఎంఎన్ఎస్ కార్యకర్తలపై పోలీసుల చర్యలను నిరసిస్తూ రాజ్ ఠాక్రే సీఎం ఉద్ధవ్ ఠాక్రేను హెచ్చరించిన నేపధ్యంలో ఎంఎన్ఎస్ చీఫ్కు బెదిరింపు లేఖ రావడం గమనార్హం.
మహారాష్ట్ర ప్రభుత్వం మే 4న పెద్దసంఖ్యలో ఎంఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుందని, 28,000 మంది మహారాష్ట్ర సైనికులకు ముందస్తు నోటీసులు జారీ చేశారని, పెద్దసంఖ్యలో తమ కార్యకర్తలను జైళ్లలో నిర్బంధించారని మహారాష్ట్ర సీఎంకు రాసిన లేఖలో రాజ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.