ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి లేఖ రాశారు. పోర్నోగ్రఫీ కేసులో తాను నిర్దోషినని పేర్కొన్న కుంద్రా.. ముంబై క్రైమ్ బ్రాంచ్ సీనియర్ అధికారులు తనను ఇరికించారని లేఖలో ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేఖలో సదరు అధికారుల పేర్లను సైతం రాజ్కుంద్రా పేర్కొన్నట్లు సమాచారం.
నీలిచిత్రాలను చిత్రీకరించి, వాటిని కొన్ని యాప్స్ ద్వారా ఆన్లైన్లో పబ్లిష్ చేశారంటూ రాజ్కుంద్రాపై ఆరోపణలున్నాయి. అయితే, యాప్ తన బావదని, అందులో నీలిచిత్రాలు లేవని లేఖలో పేర్కొన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్లోని కొందరు అధికారులు తనను ఇరికించేందుకు ఇదంతా చేశారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రతిసాక్షిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అలాగే తనకు న్యాయం చేయాలంటూ రాజ్కుంద్రా ప్రధాని కార్యాలయానికి సైతం లేఖ రాశారు.
నీలి చిత్రాలు తీయడం, ఇందుకు సంబంధించిన నిందితుల్లో ఎవరితోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని కుంద్రా పేర్కొన్నారు. పోర్నోగ్రఫీ కేసులో రాజ్కుంద్రాతో పాటు అతని ఉద్యోగి ర్యాన్ థోర్ప్ను గతేడాది జూలై 19న అరెస్ట్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయగా.. సెప్టెంబర్ 19న బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. రాజ్కుంద్రా ఇటీవల తాను నిర్దోషినని, ప్రాసిక్యూషన్ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఖిలా కోర్టులో డిశ్చార్జ్ దరఖాస్తు దాఖలు చేశాడు.