మంచిర్యాల, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయని పథకం ఏదైనా ఉందంటే అది ‘రైతుబంధు’గా చెప్పొచ్చు. సువిశాల భాతరదేశంలో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రం అమలు చేయని స్కీం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు వ్యవసాయం చేయాలంటే ఏడుపొచ్చేది. ఏ షావుకారి దగ్గరికో, వడ్డీ వ్యాపారి దగ్గరో అప్పు చేస్తే పంటంతా ఆయనకే ఇచ్చేయాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితిలో సీఎం కేసీఆర్ రైతన్నకు పెట్టుబడి సాయం అందించాలని తలంచారు. మే 10, 2018 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఐదున్నరేండ్లలో పదకొండు విడుతలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అందించారు. ప్రస్తుతం ప్రతి సీజన్కు ఎకరాకు రూ.5 వేల చొప్పున యేడాదికి రెండు విడుతలుగా అంటే రూ.10 వేలు బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్నది. దీనిని తాజాగా రూ.16 వేలకు పెంచుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. మొదటి యేడాది రూ.12 వేలు పెంచి.. ఐదేండ్లలో క్రమంగా రూ.16 వేలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతును రాజుగా మార్చి.. రైతన్నల గురించి వినూత్న, విప్లవాత్మక, మహత్తర పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్కు రైతన్నలు జేజేలు పలుకుతున్నారు.
తెలంగాణ రాక ముందు వ్యవసాయం చేయాలంటే ఏడుపొచ్చేది. సాగు చేయాలంటే తెలిసిన సేటు దగ్గరో, వడ్డీ వ్యాపారి దగ్గరో అప్పు చేయాల్సిన దుస్థి తి. తీరా పంట చేతికొచ్చాక వచ్చే డబ్బులు వడ్డీ వ్యాపారి జేబులోకే వెళ్లిపోయేవి. కరెంట్ లేక మోటార్లు కాలిపోయేవి.. ఏ అపరాత్రో, అర్ధరాత్రో దొంగోనోలే వచ్చే కరెంట్ కోసం రైతులు పడిగాపులు కాసేటోళ్లు. మోటార్ వేసేందుకు పోయి ఏ తేలుకుట్టో, పాము కరిసో లేదా కరెంట్ షాక్ కొట్టో సచ్చిపోయేటోళ్లు. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు వ్యవసాయం అంటే దండగ.. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. పంట పెట్టుబడికి రైతులు అప్పు చేసే అక్కర లేకుండా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిండు. ఎకరం భూమి ఉంటే యేడాదికి రూ.10 వేలు పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో వేయిస్తున్నడు. 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా పోయింది. నాడు దండగ అన్న వ్యవసాయం పండుగైంది.
సీఎం కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు తెల్లబడుతున్నరు. రైతుల బాగు కోసం వ్యవసాయస్థిరీకరణ లక్ష్యంగా కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. రూ.10 వేలు వస్తున్న రైతుబంధును రూ.16 వేలు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంంలోకి రాగానే దాన్ని అమలులోకి తీసుకురానున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రూ.12 వేలు ఇచ్చి, మరుసటి ఏడాది నుంచి కొద్దికొద్దిగా పెంచుకుంటూ రూ.16 వేలు చేయనున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడంతో రైతులు తెగ సంబురపడిపోతున్నారు. కేసీఆర్తోని ఏదైనా సాధ్యం అయితదని చెప్తున్నారు. పెట్టుబడి సాయం పెంచుతామని ప్రకటించి రైతులకు పక్షపాతిగా బీఆర్ఎస్ మరోసారి నిలిచిందంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.53 లక్షల మంది రైతులకు పెంచిన రైతుబంధు ద్వారా లబ్ధిచేకూరనుంది. తాజాగా ఇస్తున్న పోడుపట్టాలతో రైతుల సంఖ్య మరింత పెరుగనుంది. రైతుబంధు సాయం పెంపు హామీపై రైతుల స్పందనలు వారి మాటల్లోనే..
ఎవుసం చెసేటోళ్లకే తెలుస్తది..
ఖానాపూర్, అక్టోబర్ 24 : నేను 35 ఏండ్ల నుంచి ఎవుసం చేస్తున్న. ఎవుసం చేసేటోళ్లకే రైతులకు కష్టాల విలువ తెలుస్తది. గతంలో కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని పరిస్థతి ఉండేది. గిప్పుడయితే 24 గంటల కరెంట్ ఉంటున్నది. గప్పటిలెక్క ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతలేవు. ఇగ రైతులు పంటలు వేసుకునేందుకు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వమే ఏడాదికి రూ. 10 వేలు ఎకరాకు ఇస్తున్నది. గిప్పుడు మళ్లీ గెలిస్తే రూ. 16 వేలు ఇస్తనని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో చెప్పిండు. గిట్లయితే అందరం ఆయనకే మద్దతుగా నిలుస్తం. రైతుల కష్టాలను గతంలో పట్టించుకున్నోళ్లే లేరు. ఫస్ట్ మా బాధల్ని తీర్చింది సీఎం కేసీఆరే. అందుకే ఆయన చేసిన సాయాన్ని మరిచేది లేదు.
– పడిగెల చంద్రయ్య, పాత తర్లపాడు
అప్పుల రంది పోయింది..
ఖానాపూర్, అక్టోబర్ 24 : గతంలో సాగు చేద్దామంటే ఎన్నో ఇబ్బందులు ఉంటుండే. సాగుకు పెట్టుబడులు ఎల్లక తిప్పలయ్యేది. సీఎం కేసీఆర్ అచ్చినంకనే మా రంది పోయింది. మిషన్ కాకతీయతోని చెరువుల కింద రెండు పంటలు పండుతున్నయ్. రెండు కాలాలూ వరినే వేస్తున్న. ఇగ పెట్టుబడి సాయంతోని అప్పులు చేసే రంది పోయింది. రైతుబంధు వచ్చినంకనే అప్పుల కోసం దళారీల చుట్టూ తిరిగే తిప్పలు తప్పింది. ఇప్పుడు కేసీఆర్ సారు రైతు బంధు సాయం చేస్తమని చెబుతున్నడు. ఇప్పటికైతే ఎకరాకు రూ. 10 వేలు ఏడాదికి ఇస్తున్నడు. ఇగ మళ్లా గెలిస్తే రూ. 16 వేలు ఇస్తనని మ్యానిఫెస్టోలో పెట్టిండు. ఆయన గెలిస్తనే మంచి పనులు అయితయ్. మళ్లీ ఆయనే సీఎంగా ఉండాలే. – రామిడి నర్సయ్య, తర్లపాడు
కష్టం తెలిసిన రైతు కేసీఆర్..
సిర్పూర్(టీ), అక్టోబర్ 24: రైతుల కష్టమంతా సీఎం కేసీఆర్కు తెలుసు. పదేండ్ల సంది ఆయన చేస్తున్న మంచి పనులంతా రైతుల గురించే. మరోసారి అధికారంలోకి రాగానే రైతు బంధు సాయం పెంచుతమని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం మస్తు సంబురమనిపించింది. రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నడు. ఇప్పటికే రుణమాఫీ చేసి మమ్మల్ని అప్పుల బాధ నుంచి విముక్తి చేసిన్రు. ఎకరాకు రూ. 10వేలు ఇస్తూ పెట్టుబడికి తోడవుతున్నడు. దళారులతో ఇబ్బందులు లేకుండా చేస్తున్నడు. ఇక పండిన పంటల్ని కూడా ప్రభుత్వమే కోనుగోలు చేస్తున్నది. పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. ఇప్పడిస్తున్న రైతు బంధు సాయాన్ని పెంచుతనని ఆయన చెప్పంగనే మస్తు సంతోషమేసింది. ఆయన చెప్పిండంటే చేస్తడు. గతంలో చెప్పనివెన్నో చేసిండు. గిప్పుడు మాకు సీఎం కేసీఆర్ మీద నమ్మకమున్నది. రైతులంతా సీఎం కేసీఆర్కే అండగా నిలుస్తరు. నాకైతే పూర్తి నమ్మకమున్నది.
– బొమ్మన శ్రీనివాస్, రైతు
కేసీఆర్ సారే రావాలి..
జైపూర్, అక్టోబర్ 24: నాకు మా గ్రామ శివారులో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు సాయం పంట ఖర్చులకు ఉపయోగిస్తున్న. గతంలో పెట్టుబడులు వెళ్లకుంటే మస్తు తిప్పలయ్యేది. ఇప్పుడైతే సర్కారే పెట్టుబడికి పైసలిస్తున్నది. ఇగ ఈ సాయం మళ్లా పెంచుతరంట. మొన్ననే కేసీఆర్ చెప్పిండు. టీవీల చూసిన. పార్టీ మళ్లా గెలిస్తే ఎకరాకు ఏడాదికి రూ. 16 వేలు ఇస్తమన్నడు. మస్తు సంతోషమనిపించింది. సారే పెట్టుబడికి డబ్బులిస్తున్నడు. 24 గంటల కరెంటిస్తున్నడు. సాగు నీటికి ఢోకా లేకుండా చేసిండు. సారే పంటను కొంటున్నడు. ఇంత మంచిగ చేస్తున్న కేసీఆర్ సారును ఎవరు కాదనుకుంటరు. ఆయన ఉంటనే పేదోళ్లకు మంచి జరుగుతది.
-గోనె లింగమ్మ, టేకుమట్ల
సాగు ఖర్చులకు ఇబ్బంది లేదు..
కన్నెపల్లి, అక్టోబర్ 24 : సీమాంధ్ర పాలకులు చెయ్యబట్టి ఎవుసం అరిగోసయ్యింది. పెట్టుబడి ఖర్చులు కూడా ఎళ్లక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ఇగ సీఎంగా కేసీఆర్ అచ్చినంకనే రెండు సార్లు రైతుబంధు ఇస్తున్నరు. విత్తనాలు, కూలీల ఖర్చులకు ఇబ్బంది లేకుండా అయ్యింది. సీజన్కు ముందే ఖాతాల్లో డబ్బులు వేయడంతో విత్తనాలు, ఎరువులు కొనుక్కుంటున్నం. రైతుబంధు సమాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 16 వేల వరకు పెంచుతున్నట్లు కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఖర్చులకు ఇబ్బంది లేకుండా మరింత ఆసరా కానుంది. ఇలాంటి ప్రభుత్వాన్నే రైతులు కోరుకుంటున్నారు.
– టకిరె సత్యనారాయణ, రైతు , కన్నెపల్లి
నేనైతే సర్కారు ఇస్తున్న పెట్టుబడి సాయంతోనే పంటలు వేస్తున్న. నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఎకరాకు రూ. 10 వేలు సాయం అందిస్తున్నది. అంటే నాకు ఏడాదికి రూ. 40 వేలు వస్తున్నయ్. గిప్పుడు నేనైతే అప్పు కోసం ఎక్కడికీ పోతలేను. ఎవ్వరి దగ్గరా బాకీ అడగకుండా చాలా చక్కగా వ్యవసాయం చేసుకుంటున్న. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే ఎకరాకు రూ.16 వేలు ఏడాదికి ఇస్తమని చెబుతున్నరు. పేద రైతులకు ఇది ఎంతో మేలు చేస్తది. రైతుల కుటుంబాలు ఇప్పుడు కొద్దో గొప్పో సంతోషంగా ఉంటున్నయంటే అది సీఎం కేసీఆర్ సారు చెయ్యవట్టే. ఆయన సల్లంగుండాలె.
– రాథోడ్ జైపాల్, లింగాపుర్
ఇది రైతులకు మరింత భరోసా..
జైపూర్, అక్టోబర్ 24: నాకు రామరావుపేట శివారులో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సీజన్కూ రూ. 12,500 సాయం అందుతున్నది. వీటిని ఎరువులు, విత్తనాలు కొనేందుకు వాడుకుంటున్న. గిప్పుడు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు సాయం పెంచుతరంట. మ్యానిఫెస్టోలో పెట్టిర్రని ఊళ్లో అందరూ అనుకుంటున్నరు. చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడి ఖర్చులకు ఎంతో ఆసరాగా ఉంటుంది. ఈ నిర్ణయమైతే రైతులకు మరింత భరోసా కలిగిస్తున్నది. నేనైతే రైతులకు మంచి చేసేటోళ్లకే ఓటేస్తా.
– పూదరి సత్తయ్య, రామరావుపేట
రైతుల పార్టీ బీఆర్ఎస్
గతంలో రైతులను పట్టించుకున్న లీడరే లేడు. ఎన్నో కష్టాలు పడ్డం. పంట సాగు చేయాలంటే అప్పుల కోసం తిరగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ అచ్చినంకనే మా కష్టాలన్నీ ఒక్కొక్కటీ పోతున్నయ్. మేం అడగకముందే రైతు బంధు సాయం ప్రకటించిండు. ఎకరాకు రూ. పదివేలు ఏడాదికి ఇస్తున్నడు. నాకున్న ఐదెకరాలకు ఏడాదికి రూ.50 వేలు వస్తున్నయ్. ఇప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేస్తలేను. రాష్ట్రంలో మళ్లీ గెలిస్తే రూ. 16 వేలు ఇస్తమని సీఎం కేసీఆర్ చెబుతున్నడు. ఇప్పటికే మ్యానిఫెస్టోలో ఇదే పెట్టిండు. ఇట్లయితే నాలాంటి బీద రైతుకు మంచి జరుగుతది. పెట్టుబడి తిప్పలు తప్పుతయ్. రైతులకు మంచిజేసుడంటే సీఎం కేసీఆర్తోనే అయితది.
కేసీఆర్ సారును మరువం..
భీంపూర్, అక్టోబర్ 24 : మా కుటుంబానికి గుట్టమీది టేక్డిరాంపూర్ శివారుల ఐదెకరాల రాళ్ల భూమి ఉన్నది. మా తాత, ముత్తాతల సంది పడీతుగానే ఉండేటిది. గా ఉమ్మడి సర్కారోళ్లు రైతుకు నయాపైసా ఇయ్యక, పెట్టుబడికి పైసలు ఎల్లక భూమి ఉన్నా ఎప్పుడూ గడ్డీ గాదంతోటే ఉండేటిది. ఎప్పుడయితే సీఎం కేసీఆర్ అచ్చిండ్రో గప్పటినుంచి మా బతుకులు మారినయ్. రైతుబంధు షురూ అయినంకనే మా పల్లెల అందరూ గుంట సుత ఇడిసి పెట్టకుండా సాగుచేస్తున్నరు. నాకు ఏడాదికి రూ.50 వేలు అస్తున్నయ్. మల్లా గెలిస్తే ఏడాదికి ఎకరాకు రూ.16 వేలు ఇస్తనని సీఎం కేసీఆర్ సారు మొన్న చెప్పిండు. గిట్లయితే మా ఊళ్లో అంతా ఆయనే మల్లా రావాలె అంటున్నరు. గింత మంచి పనులు జేస్తున్న కేసీఆర్ సారునెందుకు మరుస్తం.. – కుడిమెత లక్ష్మణ్, టేక్డిరాంపూర్