Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని.. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని అంచనా వేశారు. బంగాళాఖాతంలో సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, సెప్టెంబర్ 2 వరకు ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అప్పుడప్పుడు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ పనులు చేపట్టాలని కోరారు. వర్షం కురుస్తున్న సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.