రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. వేములవాడ పట్టణంలో మధ్యతరగతి ప్రజలను, పేదలకు లక్ష్యంగా చేసుకుని అక్రమ వడ్డీ వ్యాపారానికి తెరతీసిన ఫైనాన్స్ వ్యాపారులపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కొరడా ఝులిపించారు. గతంలో సైతం వేములవాడ పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందినప్పటికీ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగటంతో అక్రమ ఫైనాన్స్ వ్యాపారుల గుండెల్లో దడ మొదలైంది.
వేములవాడ పట్టణంలో చిరు వ్యాపారులకు ఐదు రూపాయలు, పది రూపాయల చొప్పున వడ్డీకి ఇస్తూ వారి నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పట్టణంలోని కొందరు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై రైడ్ చేసి పలు కీలక పత్రాలతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో అడ్వకేట్ విద్యాసాగర్ రావు అనే వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.