CM Revanth Reddy | కొడంగల్, మార్చి 28: అభివృద్ధి పనులకు భూములు ఇచ్చేందుకు కొడంగల్ ప్రజలు ముందుకు రావాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అసైన్డ్ భూములకు సైతం ప్రైవే టు భూముల ధరలే చెల్లిస్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు. భూమి అందుబాటులో ఉంటేనే అభివృద్ధి పనులు పూర్తవుతాయని, లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగం గా గురువారం ఆయన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని ఎంపీడీవో కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పట్టణంలోని సీఎం నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏండ్ల తరబడి కొడంగల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే తనకు సీఎంగా అవకాశం వచ్చిందని, కొడంగల్కు ఇదో సువర్ణ అవకాశమని, పూర్తి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కొడంగల్కు ఇప్పటి వరకు మెడికల్, ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాల, బీటీరోడ్లతోపాటు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తదితర అభివృద్ధి పనులు మంజూరయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్మాణ పనులకు నిధులు కూడా అందించినట్టు పేర్కొన్నారు. వందల కోట్ల నిధులతో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించినట్టు చెప్పారు. నియోజకవర్గ ప్రజలే ముందుకు వచ్చి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఫార్మా కంపెనీలు ఈ ప్రాంతానికి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు. కొడంగల్కు నష్టం జరిగే ఏ పనినీ తలపెట్టనని హామీ ఇచ్చారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను సీఎం హోదాలో ఉన్నా కొడంగల్ బిడ్డగానే అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. త్వరలోనే కొడంగల్లో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతున్నదని, కొడంగల్ మీదుగా కృష్ణా రైల్వేలైన్ పూర్తిచేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడి విద్యార్థులు కర్ణాటక వెళ్లి చదువుకునే వారని, ఇక్కడ మెడికల్ కళాశాల వంటివి పూర్తయితే కర్ణాటక ప్రజలు ఇక్కడికే వచ్చి చదువుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో తనను గెలిపించినట్టుగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ను గెలిపించాలని రేవంత్రెడ్డి కోరారు. ఏప్రిల్ 6న హైదరాబాద్ తుక్కుగూడలో రాహుల్గాంధీతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసినట్టు రేవంత్రెడ్డి తెలిపారు. ఆ సభలో రాహుల్గాంధీ 5 గ్యారెంటీలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, పార్టీ నాయకులు యూసుఫ్, నందారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.