న్యూఢిల్లీ : దేశీయ వంటగ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘ప్రజలను ఖాళీ కడుపులతో పడుకోబెట్టి.. తాను మాత్రం స్నేహితుల నీడలో హాయిగా నిద్రపోతున్నాడంటూ’ పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా దేశం ఏకమవుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెరిగిన సిలిండర్ల ధరల పట్టికను సైతం ట్యాగ్ చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్పై రూ.25 పెంచిన విషయం తెలిసిందే. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో రూ.884.50కు చేరింది. ఇంతకు ముందు ఆగస్ట్ 18న గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగ్గా.. గత జనవరి నుంచి సిలిండర్పై రూ.190 వరకు పెరిగింది. ఇవాళ 19 కిలోల వాణిజ్య సిలిండర్పై రూ.75 పెరగ్గా.. ప్రస్తుతం ధర రూ.1,693కు చేరింది.