ఐఐటీ విద్యావిధానంలో సమూల మార్పులు
పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యాప్రణాళిక
ఆన్లైన్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సులు
ఎంటెక్లో ఒక ఏడాది మొత్తం ప్రాక్టికల్సే
దేశంలో అత్యుత్తమ ఐఐటీల్లో మాది 8వ స్థానం
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బూదరాజు శ్రీనివాసమూర్తి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల సరసన ఐఐటీ హైదరాబాద్ చేరింది. సెకండ్ జనరేషన్ ఐఐటీల్లో దేశంలో 8వ స్థానం దక్కించుకోవడమే కాకుండా ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఇచ్చే క్యూఎస్ ర్యాంకింగ్లో పదో స్థానాన్ని కైవసం చేసుకున్నది. 2008లో ప్రారంభమైన ఐఐటీ హైదరాబాద్ ఇప్పుడు పూర్తిస్థాయి క్యాంపస్తో అత్యుత్తమ ఐఐటీల్లో ఒకటిగా నిలిచింది. 2020-2021 విద్యాసంవత్సరం నుంచి అనేక కొత్త కోర్సులు, విద్యార్థి కేంద్రీకృత కార్యక్రమాలు చేపడుతున్నది. ‘లోకల్ టు గ్లోబల్’ నినాదంతో తాము పనిచేస్తున్నామని, స్థానికంగా పరిశ్రమలు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించి, పరిశ్రమలు, ప్రజల అవసరాలు తీర్చేలా విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తున్నామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బూదరాజు శ్రీనివాసమూర్తి చెప్పారు. దేశంలో మెటలర్జీ ఇంజినీరింగ్లో లబ్ధప్రతిష్టులైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఈ రంగంలో కృషికిగాను దేశంలోనే ఇంజినీరింగ్రంగంలో అత్యున్నతమైన శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును 2007లో శ్రీనివాసమూర్తి అందుకొన్నారు. 2019 నుంచి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఐఐటీలో తన ఆధ్వర్యంలో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ముఖాముఖి ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా మార్పులు దేశంలో విద్యావిధానం విషయంలో ఐఐటీలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుంటాయి. గతంలో థియరీలు ఎక్కువ, ప్రాక్టికల్ నాలెడ్జి తక్కువగా ఉండేది. పరిశ్రమల అవసరాలు ఒకలా ఉంటే.. విద్యావిధానం, పాఠ్యప్రణాళిక ఇంకోలా ఉండేది. ఇప్పుడు విద్యావిధానం సమూలంగా మారింది. దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా హైదరాబాద్ ఐఐటీని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కొత్త ప్రయోగాలు చేస్తున్నాం. మా విద్యార్థులకు పరిశ్రమలతో ప్రత్యక్ష పరిచయం ఉండేలా చూస్తున్నాం. దేశవ్యాప్తంగా చాలా పరిశ్రమలు, పారిశ్రామిక రంగాలవారితో ఒప్పందాలు చేసుకుంటున్నాం. హైదరాబాద్లోని చర్లపల్లి పారిశ్రామికవాడలో ఎంఎస్ఎంఈ సంస్థలతో ఇటీవల చర్చించాం. మా విద్యార్థులు పారిశ్రామికవాడలోని వివిధ సంస్థలతో కలిసి పనిచేసేలా కోర్సులను డిజైన్ చేస్తున్నాం. ఐఐటీలో చదివే ప్రతీ ఎంటెక్ విద్యార్థి కనీసం 14 గంటల ఇండస్ట్రీ లెక్చర్స్కు హాజరు కావాల్సి ఉంటుంది. రెండేండ్ల ఎంటెక్ కోర్సులో ఒక ఏడాది థియరీ ఉండగా, మరో ఏడాది మొత్తం ఇండస్ట్రీతో పనిచేయాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ- ఇన్స్టిట్యూషన్ మధ్య సమన్వయకర్తలను ఏర్పాటుచేశాం. ఇక్కడ ఎంటెక్లో పది వేర్వేరు కోర్సులున్నాయి. అన్ని కోర్సుల్లోనూ ఇండస్ట్రీ లెక్చర్స్ ఉండేలా సిలబస్ మార్చాం. బీటెక్లో కూడా ఇదేతరహా ప్రయోగం చేస్తున్నాం. బీటెక్లో ఆరు సెమిస్టర్లలో ఒక సెమిస్టర్ను పూర్తిగా ఫ్రీ సెమిస్టర్గా మార్చేశాం. విద్యార్థులు తమకు నచ్చిన ఇండస్ట్రీకి వెళ్లే అవకాశం ఇచ్చాం. ఇదో కొత్త ప్రయోగం. ఇప్పటివరకు మనదేశంలో బీటెక్లో ఈ తరహా విధానమే లేదు.
ఐదు గ్రామాల దత్తత
స్థానిక ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఐఐటీ హైదరాబాద్కు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఐదు గ్రామాలను దత్తత తీసుకోవాలని నిర్ణయించాం. కంది, మామిడిపల్లి, ఫసల్వాడి గ్రామాల్లో రైతులకు రిమోట్సెన్సింగ్ సేవలను అందించడం, పంటలపై సలహాలు,భూసార పరీక్షలు నిర్వహించడం తదితర కార్యక్రమాలు చేపట్టాం. మరిన్ని గ్రామాలకు ఈ సేవలు విస్తరించబోతున్నాం. వ్యవసాయరంగంలో కృత్రిమ మేధ వినియోగం, ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక పద్ధతులు, వరదల నియంత్రణ, ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్పై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం.
అతిపెద్ద రిసెర్చ్ పార్కులు..
ఐఐటీ హైదరాబాద్లో ఒకటిన్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద రిసెర్చ్ పార్కును ఏర్పాటుచేస్తున్నాం. మరో ఆరు నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. దీని పక్కనే మరో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తున్నాం. అంతర్జాతీయస్థాయిలోని అనేక సంస్థలు మాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. జపాన్కు చెందిన సుజూకీ ఇప్పటికే మాతో ఒప్పందానికి ఆసక్తి చూపింది. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఐఐటీ హైదరాబాద్ జాతీస్థాయిలో ఉత్తమ విద్యాసంస్థగా అవతరించింది. దేశంలోని 23 ఐఐటీలకు ఎన్ఐఆర్ఎఫ్ ఇచ్చే ర్యాంకింగ్లో ఐఐటీ హైదరాబాద్ 8వ స్థానాన్ని సాధించింది. క్యూఎస్ ర్యాంకింగ్లో పదో స్థానంలో నిలిచింది.
ఆన్లైన్లో ఎంటెక్
ఐఐటీలంటే అక్కడే ఉంటూ చదువుకోవాలన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ, ఐఐటీ హైదరాబాద్ మరో వినూత్న ఆలోచనతో ఆన్లైన్లో ఎంటెక్ కోర్సును ప్రవేశపెట్టింది. రెండేండ్ల పని అనుభవం ఉండి బీటెక్లో ఫస్ట్క్లాస్ డిగ్రీ ఉన్నవాళ్లకు ఈ కోర్సు అందిస్తున్నాం. ఆన్లైన్లో ఎంటెక్ చేసేవాళ్లు ప్రాజెక్టు వర్క్ను వారు పనిచేస్తున్న కంపెనీలోనే పూర్తిచేసే వెసులుబాటు కూడా ఇచ్చాం. అడ్మిషన్ తీసుకున్ననాటి నుంచి అయిదేళ్లలో కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. వివరాల కోసం మా వెబ్సైట్ చూడవచ్చు. పీహెచ్డీలో కూడా మా సంస్థ వినూత్న పంథా అనుసరిస్తున్నది. ఆన్లైన్ విధానాన్ని పీహెచ్డీ ప్రోగ్రాంలో కూడా ప్రవేశపెట్టాం. ఇదో వినూత్న ప్రయోగం.
స్థానిక భాషల్లో ఇంజినీరింగ్
స్థానిక భాషల్లో ఇంజినీరింగ్ విద్య బోధించాలన్న తలంపుతో ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుధేతో కలిసి ఎంపీటెల్ అనే కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాం. దేశవ్యాప్తంగా 2,500 కోర్సులను స్థానిక భాషల్లోకి అనువదించే కార్యక్రమం జరుగుతున్నది. మెషిన్ లాంగ్వేజ్ను తర్జుమా చేయాలంటే స్థానిక భాషపై పట్టున్న నిపుణుల అవసరం. దేశంలోని అన్ని ఐఐటీలు ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే కొన్ని వీడియోలను రూపొందించి యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం. ఐఐటీల్లో వివిధ సంస్కృతి, కళలకు సంబంధించిన కోర్సులున్నాయి. లలిత కళలు, డ్యాన్స్, చరిత్ర, పరిశోధన వంటివి ఇప్పటికే ఉన్నాయి. తాజాగా సంస్కృతాన్ని కూడా జోడించాం. నాలుగేండ్లపాటు దీన్ని విద్యార్థులు చదువుకోవచ్చు. సంస్కృత భారతి సహకారంతో ఈ కోర్సు అందిస్తున్నాం