హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికి దళితబంధుతో శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నది. కాంట్రాక్టుల్లో కూడా దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలను సాకారం చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, పోషకాహార (డైట్) ఏజెన్సీల కాంట్రాక్టుల్లో 16 శాతం దళితులకు కేటాయించింది. ఈ ప్రక్రియను వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు మంగళవారం కోఠిలోని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. పూర్తి పారదర్శకంగా డ్రా ద్వారా దవాఖానలను ఎంపికచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా సంఖ్యకు అనుగుణంగా దళితులకు కాంట్రాక్టుల్లో కోటా ఇవ్వాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బ్రిటిష్ కాలంలోనే డిమాండ్ చేశారని చెప్పారు. నాడు అంబేద్కర్ కన్న కలను నేడు సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని చెప్పారు. దళితుల అభ్యున్నతికి అన్ని రంగాల్లోనూ ప్రత్యేక కోటా అమలవుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో 100 లోపు పడకలు ఉన్న దవాఖానలు 122, వంద నుంచి 500 పడకలు ఉన్న దవాఖానలు 53 ఉన్నాయి. వీటిల్లో 28 దవాఖానల ఐహెచ్ఎఫ్ఎంఎస్, 28 దవాఖానల డైట్ ఏజెన్సీలను దళితులకు కేటాయించారు.
దళితబంధు అంటే డబ్బు పంచడం కాదు
దళితబంధును ఉద్యమంగా మంత్రి హరీశ్రావు అభివర్ణించారు. దళితులకు డబ్బులు పంచడమే పరిషారం కాదని, సామాజిక అసృ్పశ్యతను తొలగించాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదని, లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకొనేలా అధికారులు, ప్రజాప్రతినిధులు మార్గనిర్దేశనం చేస్తున్నారని వివరించారు. దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని.. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలన్న అంబేదర్ కలను సీఎం కేసీఆర్ నిజం చేశారని చెప్పారు. తాను నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇరిగేషన్ టెండర్లలో 21% ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ జీవో-59 విడుదల చేశామని గుర్తుచేశారు. దళితబంధు కింద ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ప్రస్తుతం 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళితులు కూర్చుంటున్నారని చెప్పారు.
ఏజెన్సీలకు త్వరలో టెండర్లు
ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. 28 చొప్పున రెండు విభాగాలకు కలిపి 56 హాస్పిటళ్లను దళితులకు కేటాయించినట్టు తెలిపారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ త్వరలో వీటికి టెండర్లు పిలుస్తారని చెప్పారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండరు నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చామన్నారు. టర్నోవర్లో 50% తగ్గించామని, ఒక టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహణ మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఒకో బెడ్కు ఇచ్చే చార్జీలను రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచామని, డైట్ చార్జీలను రెట్టింపు చేశామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా అదనంగా రూ.350 కోట్లకుపైగా వెచ్చిస్తున్నదని వివరించారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలనుకొంటున్నామని, ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
చారిత్రాత్మక సందర్భం
టీఎస్ఎంఎస్ఐడీఎస్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్పిటళ్లలో దళితులకు 16% ఏజెన్సీలను కేటాయించడం చారిత్రకమన్నారు. ఇప్పటికే వైన్స్లో కోటా కేటాయించారని, ఇప్పుడు ఏజెన్సీలను కేటాయిస్తున్నారని చెప్పారు. ‘దళితులను కూలీలుగా పనులు చేయడం కోసం మాత్రమే పరిమితం చేయవద్దని.. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పించాలని’ అంబేద్కర్ డిమాండ్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు హాజరయ్యారు.
డైట్ ఏజెన్సీలు కేటాయించిన 100 పడకలలోపు దవాఖానలు
యూసీహెచ్సీలు.. అంబర్పేట (హైదరాబాద్), డబీర్పురా (హైదరాబాద్)
పీహెచ్సీలు.. బూర్గంపాడు, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), గూడూరు (మహబూబాబాద్), బెల్లంపల్లి (మంచిర్యాల), ఏటూరునాగారం (ములుగు), ఉప్పునూతల (నాగర్కర్నూలు), నకిరేకల్ (నల్గొండ), మక్తల్ (నారాయణపేట్), ముథోల్ (నిర్మల్), డిచ్పల్లి (నిజామాబాద్), మహేశ్వరం (రంగారెడ్డి), మీర్జాపూర్ (సంగారెడ్డి), మర్పల్లి (వికారాబాద్), ఖిలాగణపూర్ (వనపర్తి), వర్ధన్నపేట (వరంగల్), ఘట్కేసర్ (మేడ్చల్ మల్కాజిగిరి), కల్వకుర్తి (నాగర్కర్నూల్), ధర్మపురి (ఎంసీహెచ్ – జగిత్యాల)
100-500 పడకల దవాఖానలు..
భూపాలపల్లి (ఏరియా హాస్పిటల్ – జయశంకర్ భూపాలపల్లి), లక్సెట్టిపేట్ (ఏహెచ్- మంచిర్యాల), వనస్థలిపురం (ఏహెచ్- రంగారెడ్డి), భద్రాచలం (ఏహెచ్- భద్రాద్రి కొత్తగూడెం), ప్రభుత్వ సీడీ, టీబీ హాస్పిటల్ (వరంగల్), జనరల్ హాస్పిటల్ (సిద్దిపేట), జనరల్ హాస్పిటల్ (మహబూబ్నగర్), జిల్లా దవాఖాన (కరీంనగర్),
ఐహెచ్ఎఫ్ఎంఎస్ ఏజెన్సీలు కేటాయిం చిన 100 పడకలలోపు దవాఖానలు
పీహెచ్సీలు.. కాగజ్నగర్ (కుమ్రం భీం ఆసిఫాబాద్), అశ్వారావుపేట, ఎల్లనూరు (భద్రాద్రి కొత్తగూడెం), బచ్చన్నపేట (జనగాం), దోమకొండ (కామారెడ్డి), బాలానగర్ (మహబూబ్నగర్), బెల్లంపల్లి (మంచిర్యాల), రామాయంపేట (మెదక్), ఏటూరు నాగారం (ములుగు), సుల్తానాబాద్ (పెద్దపల్లి), యాచారం (రంగారెడ్డి), మనూర్ (సంగారెడ్డి), తుంగతుర్తి (సూర్యాపేట), పరకాల, కమలాపూర్ (హన్మకొండ), ఆలేరు (యాదాద్రి భువనగిరి), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి), మంథని (పెద్దపల్లి) సీతాఫల్మండి (యూసీహెచ్సీ హైదరాబాద్), ఉట్నూరు (జిల్లా దవాఖాన – ఆదిలాబాద్).
100-500 పడకల దవాఖానలు..
బాన్సువాడ (ఏరియాహాస్పిటల్ – కామారెడ్డి), మిర్యాలగూడ (ఏహెచ్, నల్గొండ), ఆర్మూర్ (ఏహెచ్- నిజామాబాద్), వేములవాడ (ఏహెచ్) – రాజన్న సిరిసిల్ల, వనస్థలిపురం (ఏహెచ్-రంగారెడ్డి), వికారాబాద్ (ఏహెచ్), దుబ్బాక (సీహెచ్ సీ- సిద్దిపేట), కింగ్ కోఠి (జిల్లా దవాఖాన – హైదరాబాద్)
ఐహెచ్ఎఫ్ఎంఎస్, డైట్ ఏజెన్సీల కేటాయింపు ఇలా..
122 100 పడకలలోపు దవాఖానలు
20 ఎస్సీలకు కేటాయింపు
53 100-500 పడకల దవాఖానలు
08 ఎస్సీలకు కేటాయింపు