న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఉద్యమాన్ని విరమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. తమ డిమాండ్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం చేసిన రాతపూర్వక ముసాయిదా ప్రతిపాదనల్లోని పలు అంశాలపై మరింత స్పష్టత కోరుతున్నామని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు మంగళవారం సమావేశం అనంతరం ఓ ప్రకటనలో పేర్కొన్నది. బుధవారం మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఎంఎస్పీకి చట్టబద్ధత, కేసుల ఉపసంహరణ, ఇతర డిమాండ్ల పరిష్కారంపై కేంద్రం ప్రతిపాదనలపై రైతు నేతలు మంగళవారం సింఘు సరిహద్దు వద్ద సమావేశమై చర్చించారు.
ఉద్యమాన్ని త్వరలో విరమించేందుకు రైతు సంఘాల నేతలు ఓ నిర్ణయానికి వచ్చారని ఈ సందర్భంగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిస్తూ ఎస్కేఎం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, రైతుల డిమాండ్లను పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనను విరమించేది లేదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనల్లో స్పష్టత లేదన్నారు. ఉద్యమ కొనసాగింపుపై ఎస్కేఎం బుధవారం అధికారికంగా ప్రకటన చేయనున్నదని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.