వనపర్తి : ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నంబావి మండల కేంద్రంలో రూ.3.8 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించి మంత్రి మాట్లాడారు.
విద్యతో పాటు వైద్యం మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు.
ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులు విద్య, వైద్యానికి ఖర్చు చేసే పరిస్థితి రాకూడదన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ పాఠశాలలలో సౌకర్యాల కల్పనకు మన ఊరు – మనబడి పథకం ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు.
సర్కారు బడుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కృషి చేయాలని ఆయన సూచించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి,ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.