బాసెల్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్-300 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21-16, 21-8తో బుసానన్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. 49 నిమిషాల్లో ముగిసిన ఫైనల్ ఫైట్లో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ.. వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. బుసానన్తో తలపడ్డ 17 మ్యాచ్ల్లో సింధుకు ఇది పదహారో విజయం కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచిన సింధుకు తాజా సీజన్లో ఇది రెండో టైటిల్. పురుషుల సింగిల్స్లో చక్కటి ప్రదర్శనతో ఫైనల్కు చేరిన హెచ్ఎస్ ప్రణయ్ తుది మెట్టుపై తడబడి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఆఖరి పోరులో ప్రణయ్ 12-21, 18-21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.