తిరుపతి, జూన్ 18: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం ఏకాంతంగా జరిగింది. అందులో భాగంగా ఉదయం10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం జరిగింది. ఇందుకోసం 10 రకాల పుష్పాలు, 4 రకాల పత్రాలు కలిపి దాదాపు 2 టన్నులు వినియోగించారు. ఈ పుష్పాలను తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల దాతలు విరాళంగా అందించారు.