మోర్తాడ్, ఏప్రిల్ 24: అనుచిత హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ హామీలు అమలు చేసేదాకా వెంటాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకెట్, దోన్పాల్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి బీఆర్ఎస్కు ఓట్లేయాలని కూలీలను అభ్యర్థించారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్.. 120 రోజులు దాటినా అమలు చేయడం లేదన్నారు. ఇప్పుడేమో పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని విమర్శించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న బీజేపీ ఎంపీ అర్వింద్ రైతులను మోసం చేశారన్నారు. రైతులను, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు.