ఘనమైన నటవారసత్వాన్ని కీర్తికిరీటంగా ధరించి సినీ గగనసీమల్లో వెలుగులీనుతున్న ఓ తార హఠాత్తుగా రాలిపోయింది. శిఖరారోహణ మధ్యలో పట్టుతప్పి నేలజారింది. కన్నడ అగ్రహీరో పునీత్రాజ్కుమార్ అకాలమరణం భారతీయ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఆయన గుండెపోటుతో అర్థాంతరంగా తనువు చాలించడం అభిమానుల్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
పునీత్రాజ్కుమార్ సోదరులు శివరాజ్కుమార్, రాఘవేంద్రరాజ్కుమార్ నటులుగా కొనసాగుతున్నారు. పునీత్రాజ్కుమార్కు భార్య అశ్వినీతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కన్నడనాట అగ్రహీరోల్లో ఒకరిగా, పవర్స్టార్గా పేరు తెచ్చుకున్న పునీత్రాజ్కుమార్ (46) శుక్రవారం ఉదయం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. ఇంట్లో వ్యాయామం చేస్తూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో పునీత్రాజ్కుమార్ తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలించనున్నారు. ప్రభుత్వలాంఛనాలతో పునీత్రాజ్కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది.
దిగ్గజ నటుడు, కన్నడ కంఠీరవగా ప్రసిద్ధిగాంచిన రాజ్కుమార్ ముగ్గురు తనయుల్లో పునీత్రాజ్కుమార్ ఆఖరివాడు. మార్చి 17, 1975లో మద్రాస్లో జన్మించారు. తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పునీత్ రాజ్కుమార్ ఆరు నెలల వయసులోనే వెండితెరపై తళుక్కుమన్నారు. తండ్రి రాజ్కుమార్ హీరోగా 1976లో కన్నడంలో రూపొందిన ‘ప్రేమద కనికే’ చిత్రంలో బాలనటుడిగా పునీత్ రాజ్కుమార్ నటించారు. సన్నాది అప్పన్న, వసంతగీత, భాగ్యవంత చిత్రాలు బాలనటుడిగా అతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. చాలిసువ మొదగాలు, ఎరాడు నక్షత్రగలు సినిమాలతో బాలనటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. ‘ఎరాడు నక్షత్రగలు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ‘భక్తప్రహ్లాద’ చిత్రంలో తండ్రి ని ఎదురించిన ప్రహ్లాదుడిగా చక్కటి నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఎన్.లక్ష్మినారాయణన్ దర్శకత్వంలో 1985లో రూపొందిన ‘బెట్టాడ హోవు’ చిత్రం పునీత్లోని అసలైన నటనాప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది. పేదరికం కారణంగా చదువుకు దూరమై సంఘర్షణను ఎదుర్కొనే చిన్నారిగా ఆ చిత్రంలో అద్వితీయ నటనను కనబరిచాడు. ఆ సినిమాకుగాను బాలనటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకొని తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నాడు. 1989లో విడుదలైన ‘పరశురామ్’ తర్వాత చదువు కోసం సినిమాలకు విరామం తీసుకున్నారు.
2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘అప్పు’ చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు పునీత్రాజ్కుమార్. ఇందులో ధిక్కార స్వభావం కలిగిన కాలేజీ విద్యార్థిగా విలక్షణ నటనతో మెప్పించారు. ఈ సినిమాతో పునీత్ పేరు కన్నడనాట మారుమ్రోగింది. రెండు వందల రోజులకుపైగా ఆడిన ఈ చిత్రంలో అతడి డ్యాన్సులకు యువతరంలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ద్వారా ‘అప్పు’గా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆ తర్వాత వీర కన్నడిగ(‘ఆంధ్రావాలా’ రీమేక్), మయూర (‘అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి’ రీమేక్), ఆకాష్(‘ఒక్కడు’ రీమేక్), నమ్మ బసవ, అజయ్ చిత్రాలతో అగ్రహీరోగా కన్నడ చిత్రసీమలో దూసుకెళ్లారు.
యాక్షన్ హీరోగా ఇమేజ్ను సొంతం చేసుకున్న పునీత్రాజ్కుమార్ కెరీర్ ‘మిలనా’ చిత్రంతో కొత్త మలుపు తిరిగింది.బెంగళూరులోని పీవీఆర్ థియేటర్లో 450 రోజులు ఆడిన ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. పునీత్ కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాతో కన్నడనాట అత్యధిక పారితోషికం స్వీకరించే హీరోల జాబితాలో పునీత్ అగ్రస్థానాన్ని అలంకరించారు. అనంతరం రాజ్ ది షోమాన్, రామ్ (‘రెడీ’ రీమేక్) చిత్రాలతో విజయ పరంపరను కొనసాగించారు.
2010లో రూపొందిన ‘పృథ్వీ’ సినిమాతో కథానాయకుడిగా తన పంథాను మార్చుకున్నారు పునీత్రాజ్కుమార్. కథాంశాలపరంగా సామాజికాంశాలపై దృష్టిపెట్టాడు.తన సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటు సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. ‘జాకీ’ సినిమాలో అతడు చేసిన పోరాట ఘట్టాలకు మంచి పేరొచ్చింది. హుదుగరు, పరమాత్మ, అన్నబాండ్, నిన్నిందాలే, పవర్, రణవిక్రమ, రాజకుమార, అంజనీపుత్ర సినిమాలతో కన్నడ నాట పునీత్రాజ్కుమార్ విజయప్రస్థానం సాగింది. అనేకమైన అవార్డులు, రివార్డులు ఆయన్ని వరించాయి. పునీత్రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘యువరత్న’ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైంది. ఆయన హీరోగా నటిస్తున్న ‘జేమ్స్’. ‘ద్విత్వ’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. సుదీర్ఘ సినీ ప్రయాణంలో బాలనటుడిగా పద్నాలుగు, హీరోగా 28 సినిమాల్లో నటించారు పునీత్రాజ్కుమార్. ‘మిలనా’, ‘జాకీ’ చిత్రాలతో ఉత్తమ హీరోగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. ఎనిమిది సౌత్ ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారాయన.
నటుడిగానే కాకుండా సినీ నిర్మాతగా, గాయకుడిగా, టీవీ ప్రయోక్తగా పునీత్రాజ్కుమార్ బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. కథాబలమున్న చిన్న చిత్రాలకు ప్రోత్సహించాలనే ఆలోచనతో పీఆర్కే ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి కావలుధారి, మాయబజార్ 2016, లా, ఫ్రెండ్ బిర్యానీ లాంటి సినిమాల్ని రూపొందించారు. బుల్లితెరపై పునీత్రాజ్కుమార్ తనదైన ముద్రవేశారు. కన్నడ కోట్యాధిపతి షోకు హోస్ట్గా వ్యవహరించారు. నేపథ్యగాయకుడిగా వందకుపైగా సినిమాల్లో పాటలు పాడారు. గాయకుడిగా తాను తీసుకునే పారితోషికాన్ని సేవా సంస్థలకు కేటాయించాలని తొలినాళ్లలో తీసుకున్న నిర్ణయానికి చివరి వరకు కట్టుబడి ఉన్నారు.
తెలుగుచిత్రసీమతో పునీత్రాజ్కుమార్కు విడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ అగ్రకథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్చరణ్తో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. పునీత్ కోరిక మేరకు అతడు హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’లో ఎన్టీఆర్ ఓ పాటను ఆలపించారు. పూరి జగన్నాథ్, మెహర్ రమేష్, వీరశంకర్తో పాటు పలువురు తెలుగు దర్శకులతో పునీత్ సినిమాలు చేశారు. పునీత్ రాజ్కుమార్ నటించిన సినిమాల్లో అధికభాగం తెలుగు రీమేక్లే కావడం గమనార్హం.